న్యూఢిల్లీ : కాసేపట్లో మోదీ కొత్త క్యాబినెట్ కొలువు తీరనున్నది. ఆ టీమ్ కోసం ప్రధాని తీవ్ర కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అనుభవం, విద్య, వయసు, సామాజిక హోదా ఆధారంగా ప్రధాని కొత్త టీమ్ను ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు.
1.అనుభవానికి పెద్దపీట..
ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రమాణం చేసే బృందంలో.. నలుగురు మాజీ సీఎంలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అనుభవానికి పెద్ద పీట వేయాలని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో మంత్రులుగా చేసిన 18 మందికి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కనున్నది. మూడుసార్లు ఎంపీలుగా గెలిచినవారు 23 మంది ఉన్నట్లు తెలుస్తోంది. 46 మంది మంత్రులకు కేంద్ర ప్రభుత్వంతో పనిచేసిన అనుభవం ఉన్నది.
2.విద్య, వయసు..
విద్య కూడా ప్రధాని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త క్యాబినెట్లో 13 మంది లాయర్లు ఉడనున్నారు. ఆరుగురు డాక్టర్లు, అయిదుగురు ఇంజినీర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఏడు మంది మాజీ ఐఏఎస్లు ఉంటారు. ఇవాళ ప్రమాణం చేయనున్న 43 మందిలో 31 మంది ఉన్నత విద్యను అభ్యసించినవారే. అయితే కొత్త క్యాబినెట్ సగటు వయసు 58 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 14 మంది మంత్రులు వయసు 50 కన్నా తక్కువే ఉండనున్నది. 11 మంది మహిళా మంత్రులకు కూడా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
3.సామాజిక హోదా..
మైనార్టీ వర్గానికి చెందిన అయిదుగురికి క్యాబినెట్ హోదా దక్కనున్నది. ఒకరు ముస్లిం, ఒకరు సిక్కు, ఒకరు క్రిస్టియన్, ఇద్దరు బౌద్ద మతస్తులు ఉండనున్నారు. ఓబీసీ వర్గానికి చెందిన వారు 27 మంది ఉన్నట్లు తెలుస్తోంది. దీంట్లో అయిదుగురికి క్యాబినెట్ హోదా దక్కుతుంది. 8 మంది ఎస్టీలను రిక్రూట్ చేయనున్నారు. దీంట్లో ముగ్గురికి క్యాబినెట్ హోదా దక్కుతుంది. గోండు, సంతల్, మిజీ, ముండా, టీ ట్రైబ్, కొంకనా, సోనావాల్ తెగలవారుంటారు.