మెక్సికో సిటీ: రెండు జట్ల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ (Football Match) జరుగుతున్నది. మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న దశలో స్టేడియంలో గొడవ మొదలైంది. ఇరు జట్ల అభిమానులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ తన్నుకున్నారు. దీంతో నిర్వాహకులు మ్యాచ్ను నిలిపివేశారు. గంటసేపు సాగిన లొల్లితో 26 మంది గాయపడిన ఘటన మెక్సికోలో (Mexico) జరిగింది.
శనివారం రాత్రి మెక్సికోలోని క్వెరెటారో స్టేడియంలో క్వెరెటారో, అట్లాజ్ జట్ల మధ్య ఫుట్బాల్ జరుగుతున్నది. తమ అభిమాన ఆటగాళ్ల ప్రదర్శనను చూడటానికి చాలా మంది స్టేడియానికి తరలివచ్చారు. ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతుండగా స్టేడియంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. రెండు జట్ల అభిమానుల మధ్య చిన్న గొడవ తన్నులాటకు దారితీసింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురింపించారు. చేసేదేం లేక నిర్వాకులు మ్యాచ్ను నిలిపివేశారు. ఆటగాళ్లను భద్రత నడుమ డ్రెస్సింగ్ రూముల్లోకి తరలించారు. ఈ గొడవలో 26 మంది గాయపడ్డారు. ఇందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మిగిలినవారు క్షేమంగానే ఉన్నారని ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించామని చెప్పారు.
కాగా, ఈ ఘటనపై అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్టేడియం నిర్వాహకులకు సూచించింది.