ముంబై : మహారాష్ట్రలోని ఓ రెండు ప్రయివేటు సంస్థల్లో జరిపిన సోదాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు రూ. 390 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థల్లో దాడులు జరిపేందుకు ఆదాయ పన్ను శాఖ అధికారులు పక్కా ప్లాన్ వేశారు. ఐటీ అధికారుల ప్లాన్ సినిమాకు తక్కువేం కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరికీ అనుమానం రాకుండా ఆ వాహనాలను అందంగా తీర్చిదిద్ది, పెళ్లికి వెళ్లేవారిలా సిద్ధమై దాడులు నిర్వహించారు. ఈ రెండు సంస్థల్లో దాడులు జరిపేందుకు 120 వాహనాలను ఉపయోగించారు. అంతే కాకుండా 250 మంది సిబ్బంది పాలు పంచుకున్నారు.
మహారాష్ట్రకు చెందిన ఆ రెండు సంస్థల్లో జరిపిన ఐటీ సోదాల్లో రూ. 56 కోట్ల నగదు, 32 కిలోల బంగారం, రూ. 14 కోట్ల విలువ చేసే వజ్రాలతో పాటు ఇతర ఆస్తుల పత్రాలు, డిజిటల్ డాటాను అధికారులు సీజ్ చేశారు. ఇక 13 గంటల పాటు దాడులు నిర్వహించి, మొత్తంగా రూ. 390 కోట్ల ఆస్తుల్ని గుర్తించారు. స్టీల్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించే ఈ రెండు సంస్థలు పెద్ద ఎత్తున పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఐటీ శాఖ అధికారులు కొత్తగా ఆలోచించి, ఎవరికీ అనుమానం రాకుండా దాడులు చేశారు.
ఆగస్టు 3న 120 వాహనాలను సిద్ధం చేసి.. వాటిని పెళ్లికి వెళ్లే వెహికల్స్ మాదిరిగా సుందరంగా అలంకరించారు. ఇక ఆ వాహనాలపై ‘దుల్హన్ హమ్ లే జాయేంగే’ అని రాసి ఉంచి.. ఎవరికీ అనుమానం రాకుండా సెట్ చేశారు. ఇక అధికారులంతా పెళ్లికి వెళ్తున్నట్లు డ్రస్సులు ధరించారు. ఆ తర్వాత ఐదు బృందాలుగా విడిపోయి.. జల్నా, ముంబై, నాసిక్, ఔరంగాబాద్ లో రెండు సంస్థలకు చెందిన కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశారు.