Religion conversion | రాజస్థాన్లో మతమార్పిడులు పెద్ద ఎత్తున జరిగాయి. హిందూ దళిత కుటుంబాలు మూకుమ్మడిగా బౌద్ధమతం స్వీకరించాయి. అనంతరం గ్రామంలో ఆక్రోష్ ర్యాలీ నిర్వహించి తమ తమ ఇండ్లలోని హిందూ దేవతల బొమ్మలు, చిత్రపటాలను గ్రామ శివారులోని బేతిల్ నదిలో కలిపారు. ఈ ఘటన రాజస్థాన్లోని బారన్ జిల్లాలో చోటుచేసుకున్నది.
రాజస్థాన్ బారన్ జిల్లా పరిధిలోని భులోన్ గ్రామంలో ఈ నెల 5 న దుర్గా దేవికి పూజలు చేసి హారతి ఇచ్చారు. దీనిపై ఆగ్రహించిన అగ్ర కులస్తులు కొందరు పూజలు చేసిన యువకులపై దాడి చేసి కొట్టారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన దళితులు.. నిందితులను అరెస్ట్ చేయాలని వేడుకున్నారు. ఈ విషయంపై రాష్ట్రపతి కార్యాలయం మొదలుకుని స్థానిక పోలీసు అధికారుల వరకు అందరికీ వినతిపత్రాలు ఇచ్చి 15 రోజులు గడిచిపోయినా ఎలాంటి ఫలితం లేకపోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాంతో గ్రామంలోని దళిత కుటుంబాలు సమావేశమై హిందూ మతాన్ని వదిలి బౌద్ధం స్వీకరించాలన్న నిర్ణయానికి వచ్చారు. వీరంతా కలిసి గ్రామంలో ఆక్రోష్ ర్యాలీ నిర్వహించారు. తర్వాత ఇంటికెళ్లి అప్పటివరకు పూజలు చేసిన దేవతల బొమ్మలు, చిత్రపటాలను తీసుకెళ్లి సమీపంలోని బేతిల్ నదిలో కలిపారు. దళితులపై దాడులు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇలా మతం మార్చుకున్నట్లు వారు చెప్పారు. నిందితులను వెంటనే అరెస్టు చేయనిపక్షంలో ఛబ్రా పోలీసు కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని జిల్లా బైర్వ మహాసభ యువ మోర్చా అధ్యక్షుడు బల్ముకంద్ బైర్వా హెచ్చరించారు.