హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్-1 (మొదటి సెషన్) పరీక్ష తేదీలు మళ్లీ మారాయి. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలను జూన్ 20 నుంచి నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా వీటిని ఈ నెల 23 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. దీంతో గతంలో చెప్పిన తేదీ కంటే 3 రోజులు ఆలస్యంగా జేఈఈ మెయిన్-1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డులు ఈ వారంలోనే అందుబాటులోకి రానున్నప్పటికీ పరీక్ష తేదీలు పదే పదే మారడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొన్నది.
ఏ నగరంలో ఎగ్జామ్ రాయబోతున్నారో తెలుసుకోండిలా..
ఈ ఏడాది దేశవ్యాప్తంగా 501 నగరాలతోపాటు, అంతర్జాతీయంగా 22 నగరాల్లో జేఈఈ-1 పరీక్షల ను నిర్వహించనున్నారు. ఈ పరీక్షను ఏ నగరంలో రాయబోతున్నదీ ముందుగానే తెలుసుకొనేలా విద్యార్థులకు ఎన్టీఏ అవకాశం కల్పించింది. jeemain. nta.nic.in వెబ్సైట్ను సంప్రదించి.. విద్యార్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ వివరాలను న మోదు చేసి ఏ నగరంలో పరీక్ష రాయబోతున్నారో తెలుసుకోవచ్చని ఎన్టీఏ వర్గాలు పేర్కొన్నాయి.