హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): లైంగికదాడులకు గురవుతున్న మహిళలు, చిన్నారుల రక్షణ, వారికి తగిన సాయం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాల్లో ఇప్పటివరకు 22,988 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 79 శాతం గృహ హింసకు సంబంధించినవే ఉన్నట్టు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఇంచార్జి, అడిషనల్ డీజీ స్వాతిలక్రా వెల్లడించారు.
గురువారం భరోసా సొసైటీ జనరల్ బా డీ సమావేశం హోంమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, మహిళా, శిశుసంక్షేమశాఖ కమిషనర్ దివ్య, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరోసా కేంద్రాల పనితీరును స్వాతిలక్రా వివరించారు. భరోసా కేంద్రాల పనితీరు, బాధితులకు సాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హోంమంత్రి పలు సూచనలు ఇచ్చారు.