ఆదిలాబాద్ రిమ్స్లో స్వాబ్ టెస్ట్లు4రీక్షలు
సెంటర్లో 11 మంది సిబ్బంది విధులు
ఆదిలాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా వైరస్ను నిర్ధారించడంతో ఆర్టీపీసీఆర్ కీలకంగా మారింది. కొవిడ్ మొదటి వేవ్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ల ద్వారా పరీక్షలు నిర్వహించేవారు. ఫలితం రావడానికి వారం రోజుల సమయం పట్టేది. అప్పటివరకు రోగి పరిస్థితి విషమించేది. దీంతో సర్కారు వేగంగా పాజిటివ్, నెగెటివ్ను నిర్ధారించగలిగే ఆర్టీపీసీఆర్ పరికరాలను రిమ్స్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మే 9న ప్రారంభించగా.. తొలినాళ్లలో 150 నమూనా(స్వాబ్స్)లను పరీక్షించేవారు. ప్రస్తుతం రోజు ఐదు టెస్ట్లకే వస్తున్నాయని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ 42 రోజుల వ్యవధిలో 1,776 నమూనాలను పరీక్షించగా.. ఇందులో 214 పాజిటివ్ వచ్చాయి.
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. సెకండ్ వేవ్ ప్రారంభం కాగానే అధికారులు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ల సంఖ్యను పెంచారు. ప్రతిరోజూ 2 వేల మందికి కిట్ల ద్వారా పరీక్షలు చేశారు. పాజిటివ్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్యసేవలు అందించారు. వీటితోపాటు అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం, ప్రజలు మాస్క్లు ధరించడం, భౌతికదూరం పాటించడం లాంటి విషయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా నిర్ధారణలో భాగంగా ర్యాపిడ్ కిట్లతోపాటు మెరుగైన ఫలితాల కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్లను ప్రారంభించారు. రూ. 80 లక్షల విలువ గల యంత్రాలను అందుబాటులో పెట్టగా.. మే 9న టెస్ట్లను వైద్యశాఖ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలు ప్రారంభంకాక ముందు జిల్లాలోని ఆర్టీపీసీఆర్ టెస్ట్ల కోసం కొవిడ్ అనుమానితుల నుంచి సేకరించిన నమూనా(స్వాబ్)ను వైద్యశాఖ అధికారులు వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు పంపించేవారు. అక్కడ పరీక్షలు నిర్వహించి పాజిటివ్, నెగెటివ్ రిపోర్టు పంపించడానికి వారం రోజుల సమయం పట్టేది. దీంతో వ్యాధి నిర్ధారణలో జాప్యం జరిగేది.
1,776 పరీక్షలు
ఆర్టీపీసీఆర్ సేవలు కరోనా నివారణకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఈ సెంటర్లో ఆరు ల్యాబ్ టెక్నీషియన్లు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, 11 మంది సైంటిస్ట్లు విధులు నిర్వహిస్తున్నారు. ఆధునిక యంత్రం ద్వారా రోజూ 150 వరకు శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉండేది. వారం రోజుల వరకు రోజూ 80 వరకు నమూనాలను టెస్ట్ చేశామని, ప్రస్తుతం రోజు ఐదు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మే 9 నుంచి ఇప్పటి వరకు 1,776 ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 214 పాజిటివ్ కేసులు వచ్చాయి. గతేడాది రిమ్స్లో సీబీనాట్, ట్రానాట్ యంత్రాల ద్వారా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ యంత్రాల ద్వారా ఒక్కో శాంపిల్ను పరీక్షించాలంటే ఎక్కువ సమయం పట్టేది. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ టెస్ట్ అందుబాటులోకి రావడంతో వేగంగా శాంపిళ్లను పరీక్షించి ఫలితాలు వెల్లడిస్తున్నారు. రిమ్స్తోటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ హెల్త్ సెంటర్లలో అనుమానితుల నుంచి సేకరించిన నమూనా(స్వాబ్)ను మొదటగా బయోసేఫ్టీ కేబినెట్లో గంటన్నరపాటు పరీక్ష చేస్తారు. అనంతరం ఆర్ఎన్ఏ మిషన్ల్లో గంటన్నరపాటు పరీక్ష చేసి చివరగా పీసీఆర్ మిషన్లులో సుమారుగా రెండు గంటలపాటు ఉంచుతారు. మూడు దఫాలుగా పరీక్షల తర్వాత పాజిటివ్, నెగెటివ్ అనే విషయం నిర్ధారణ అవుతుంది. ప్రతి ఆరు గంటలకు 94 టెస్ట్లు చేసే అవకాశం ఉంది. ఆర్టీపీసీఆర్ సేవలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని వైద్యశాఖ అధికారులు అంటున్నారు.