14 మున్సిపాలిటీలపై భారీ వర్షాల ప్రభావం
రాష్ట్రంలో 43 గ్రామాలకు పూర్తిగా రవాణా బంద్
పట్టణాల్లో 307, గ్రామాల్లో 115 ఇండ్లు ధ్వంసం
పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.133 కోట్ల నష్టం
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా మున్సిపాలిటీ పరిధిలో 215 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని మున్సిపల్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 14 మున్సిపాలిటీలు వర్షాలు, వరద ప్రభావానికి గురయ్యాయని గుర్తించారు. వీటిల్లో 79 ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్నదని నివేదించారు. 61 ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో అధికంగా నాలుగు కాలనీలు ముంపునకు గురయ్యాయి. పట్టణాల్లోని 307 ఇండ్లు వర్షాల ప్రభావానికి దెబ్బతిన్నాయి.
వర్ష ప్రభావానికి 209 చెట్లు కూలిపోయాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండు, మంచిర్యాలలో ఒక రోడ్డు కోతకు గురైంది. వీటిల్లో రెండింటిని రవాణాకు అనువుగా తాత్కాలికంగా పునరుద్ధరించారు. 37 కిలోమీటర్ల మేర డ్రైనేజీలు దెబ్బతిన్నాయి. 86 కల్వర్టులు ధ్వంసమయ్యాయి. ఏడు కిలోమీటర్ల వరకు తాగునీటి సరఫరా పైపులైన్లు దెబ్బతిన్నాయి. సీడీఎంఏ కార్యాలయంలోని కంట్రోల్ రూంతో సహా మున్సిపాలిటీల కంట్రోల్ రూంలకు 565 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని పరిష్కరించామని సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ తెలిపారు. వరదల ప్రభావంపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అవసరమైన ఆదేశాలు, సూచనలను మున్సిపల్ కమిషనర్లకు జారీ చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు.
పీఆర్ రోడ్లకు రూ.133 కోట్ల నష్టం
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 109 రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి ద్వారా 43 గ్రామాలకు రవాణా సౌకర్యాలు బంద్ అయ్యాయి. 55 లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు గుర్తించారు. గ్రామాల్లో భారీ వర్షాలకు 115 ఇండ్లు పూర్తిగా, 1,130 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని గుర్తించారు. 161 ఇండ్లు నీటి ప్రభావంతో మునిగాయి. వీటిల్లోని 308 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలకు ఇప్పటి వరకు పంచాయతీరాజ్ రోడ్లకు రూ.133 కోట్ల మేర నష్టం జరిగినట్టు ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు.
రహదారుల మరమ్మతులకు తక్షణ చర్యలు
అత్యవసర పనుల కింద నిధుల కేటాయింపు
ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులను తక్షణమే మరమ్మతు చేసి పునరుద్ధరించడానికి రోడ్లు భవనాలశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రహదారుల పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని సీఎం కేసీఆర్.. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు అన్ని జిల్లాల నుంచి దెబ్బతిన్న రహదారుల సమాచారం తెప్పించుకొని ఎస్టిమేట్లు చేసి పునరుద్ధరణకు కావాల్సిన నిధులను విడుదల చేస్తున్నారు. ఎక్కడ వరద తగ్గితే అక్కడ అధికారులు పనులు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 37 చోట్ల జాతీయ రహదారులు, 70 చోట్ల రాష్ట్ర రహదారులు, మరో 65 చోట్ల పంచాయతీ రహదారులు వర్షాలకు దెబ్బతిన్నాయి. ఆ రోడ్ల పునరుద్ధరణకు అత్యవసర పనుల కింద కేటాయించిన నిధుల నుంచి ఖర్చు చేస్తున్నారు.