హైదరాబాద్ : ఓ డాక్టర్ నిర్లక్ష్యం.. నిండు ప్రాణాన్ని బలిగొన్నది. వెన్నెముకలో నొప్పిగా ఉందని ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడి పట్ల వైద్యుడు నిర్లక్ష్యంగా వహించాడు. వైద్యం చేస్తున్న క్రమంలోనే బాధిత యువకుడి శరీరంలోనే నీడిల్ విరిగిపోయింది. ఈ విషయంలో డాక్టర్కు తెలిసినప్పటికీ ఏమి తెలియనట్లు నటించాడు. తీవ్ర రక్తస్రావం జరిగి బాధితుడు అపస్మారకస్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన గోల్కొండ పోలీసు స్టేషన్ పరిధిలో ఐదు రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్గూడ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన షేక్ జునైద్(21)కు ఈ నెల 2వ తేదీన రాత్రి వెన్నెముకలో నొప్పి వచ్చింది. ఈ విషయాన్ని తండ్రి అబ్దుల్ రహీంకు జునైద్ తెలిపాడు. దీంతో స్థానికంగా ఉన్న ప్రొఫైల్ ఆస్పత్రికి కుమారుడిని తీసుకెళ్లాడు అబ్దుల్ రహీం. ఆ ఆస్పత్రిలో జనరల్ సర్జన్గా పని చేస్తున్న డాక్టర్ సజ్జాద్.. జునైద్ను నేరుగా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి వైద్యం చేశాడు. అయితే అదే రోజు రాత్రి 9:30 గంటలకు జునైద్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడని డాక్టర్ చెప్పాడు. అక్కడ్నుంచి టోలిచౌకిలోని యాపిల్ ఆస్పత్రికి జునైద్ను తరలించారు. అక్కడ కూడా డాక్టర్ సజ్జాదే వైద్యం అందించాడు. ఇక 3వ తేదీన తెల్లవారుజామున 5 గంటలకు జునైద్ మరణించినట్లు అతని కుటుంబ సభ్యులకు డాక్టర్ సజ్జాద్ తెలిపాడు. దీంతో జునైద్ డెడ్బాడీకి షేక్పేటలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
తండ్రి అబ్దుల్ రహీంకు తన కుమారుడి మరణంపై అనుమానం కలిగింది. దీంతో కుమారుడు మరణించిన ఐదు రోజులకు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం జునైద్ డెడ్బాడీని వెలికితీసి.. పోస్టుమార్టం నిర్వహించారు. జునైద్ శరీరంలో నీడిల్ విరిగిపోయినట్లు తేలింది. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారకస్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ప్రొఫైల్ ఆస్పత్రిలోనే ఈ ఘోరం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. డాక్టర్ సజ్జాద్ను కఠినంగా శిక్షించాలని జునైద్ కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేశారు.