బాసర, జూలై 31 : రాజీవ్గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయ(ఆర్జీయూకేటీ) పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీలో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులతో భర్తీ చేయనుండగా, ఏపీ విద్యార్థులతోపాటు ఓపెన్ కేటగిరీలో కేటాయించిన 15 శాతం సీట్లను త్వరలో పూర్తి చేయనున్నారు. ఆగస్టు 2 నుంచి 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆగస్టు 18న విడుదల చేయనున్నారు. కాగా.. యేటా పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు వచ్చిన జీపీఏ ఆధారంగా ఎంపిక చేసేవారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేశారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా 2.16 లక్షల మంది ఉండగా, పాలిసెట్ ఎంట్రెన్స్ ద్వారా సాధించిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి ఎంపిక చేయనున్నారు. కాగా.. పాలిసెట్ రాసిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని అధికారులు తెలిపారు. అలాగే పాలిసెట్లో ఎంపీసీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు 4.8 మార్కులను కలిపి సీట్లు కేటాయించనున్నారు.
రిజర్వేషన్లు ఇలా..
ఎస్సీలకు పది శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ-ఏ 7 శాతం, బీసీ-బీ 10 శాతం, బీసీ-సీ 1 శాతం, బీసీ-డీ 7 శాతం, బీసీ-ఈ 4 శాతం. ప్రత్యేక కేటగిరీలో దివ్యాంగులకు ఫ్రీ, సైనిక ఉద్యోగులకు 1 శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం భర్తీ చేయనున్నారు.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
మీ సేవ కేంద్రాల్లో admissions@rgukt.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఓసీ బీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 200, ఎస్టీ, ఎస్టీలకు రూ.150 చెల్లించాలి.
అప్లికేషన్ ఫీజుతోపాటు సర్వీస్ చార్జి కింద ఆన్లైన్ సెంటర్లకు అదనంగా రూ. 25 లేదా ఏపీ ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజుల వివరాలు..
రాష్ట్రంలోని పాఠశాలల్లో చదివిన విద్యార్థులు రూ. 36 వేలు చెల్లించాలి. ఫీజ్ రీయింబర్స్మెంట్కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000, ఎస్టీ, ఎస్సీలు రూ. 500 చొప్పున చెల్లించాలి. ఇతర రేషన్, గల్ఫ్దేశాల్లో చదివే అభ్యర్థులు ఏడాదికి రూ. 1.36 లక్షలు, ఎన్ఆర్ఐ విద్యార్థులకు రూ. 3.01 లక్షల ఫీజు చెల్లించాలి.
సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలు
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించేటప్పుడు ఇచ్చిన రసీదు. మార్కుల లిస్టు, నివాస సర్టిఫికెట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు, దివ్యాంగులైతే వైకల్య నిర్ధారణ సర్టిఫికెట్, సైనికో ద్యోగుల పిల్లలు అయితే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఎస్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే వాటికి సంబంధించిన అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
గ్రేడ్పాయింట్లు సమానమైతే ఇలా..
ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు పాలిసెట్లో వచ్చిన మార్కులకు 4.8 మార్కులు కలపనున్నారు. సంబంధిత కేటగిరీలో ఏ విద్యార్థుల మార్కులు ఒకేలా ఉంటే వరుసగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఎక్కువగా మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే విద్యార్థి పుట్టిన తేదీ ప్రకారం.. ఎవరు పెద్దవారయితే వారికి సీటు కేటాయించనున్నారు. ఇవి కూడా సమానంగా ఉంటే పదో తరగతిలో విద్యార్థి హాల్ టికెట్ నంబర్, రాండమ్లో ఎవరికి తక్కువగా ఉంటే వారిని ఎంపిక చేస్తారు.
4.8 మార్కులు కలిపేది వీరికే..
ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పాసై, పాలిసెట్లో సాధించిన మార్కులకు 4.8 మార్కులు కలుపనున్నారు. వీరితోపాటు నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాల, జడ్పీ హైస్కూల్, మున్సిపల్ హైస్కూల్, సాంఘిక సంక్షేమ మోడల్ స్కూల్లలో చదివిన విద్యార్థులకు ఈ అవకాశం ఇవ్వనున్నారు. ట్రిపుల్ ఐటీలో 85 శాతం సీట్లు స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లు మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 371 ఆర్టికల్ డీ సెక్షన్ 95, 2014 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ర్టాల్లో చదివే విద్యార్థులు పేమెంట్ సీటు(పాలిసెట్ రాయకున్నా పరువాలేదు)కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశాలు షెడ్యూల్లు..
ఆగస్ట్టు 2వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
ఆగస్ట్టు 12 వరకు దరఖాస్తుల చివరి తేదీ
పీహెచ్/ఎన్సీపీ/స్పోర్ట్స్ విద్యార్థులు దరఖాస్తు చేసిన హార్డ్కాపీలను పంపించేందుకు ఆగస్ట్టు 14 చివరి తేదీ. ఆగస్ట్టు 18న జాబితా విడుదల
ప్రవేశ అర్హతలు
2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతి పాసై, పాలిసెట్ ఎంట్రెన్స్ రాసిన విద్యార్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుంది.
డిసెంబర్ 31, 2021 నాటికి 18 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 21 ఏళ్లు నిండకూడదు.