హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ ౨౮ (నమస్తే తెలంగాణ): ఏపీలోని సీలేరు నుంచి హైదరాబాద్కు ఆటోలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 70 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎస్ఆర్నగర్కు చెందిన నర్సింగ్ సింగ్, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మైసిగండికి చెందిన రమావత్ రమేశ్ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. సీలేరు నుంచి హైదరాబాద్కు ఆటోలు గంజాయి తెచ్చి ఇచ్చేందుకు ఒక్కో ట్రిప్కు రూ.10 వేలు ఇస్తానని రమావత్తో నర్సింగ్ ఒప్పందం చేసుకున్నాడు. రూ.4 వేల నుంచి రూ.5 వేలకు రెండు కిలోలు కొని.. నగరంలోని నర్సింగ్కు ఇచ్చేవాడు. నర్సింగ్ 10 గ్రాములతో ఒక ప్యాకెట్ తయారు చేసి రూ.150 కి వినియోగదారులకు అమ్మేవాడు. సీలేరులో ఉన్న గంజాయి విక్రయదారుడికి డబ్బును నర్సింగ్ గూగుల్ పేలో పంపించేవాడు. ఇటీవల రమావత్ 20 కిలోల గంజాయిని సీలేరు నుంచి తెచ్చి రహమ్మత్నగర్లో డంప్చేశాడు. శుక్రవారం ఆ గంజాయిని రహమ్మత్నగర్ నుంచి తన ఆటోలో ఇతరులకు ఇచ్చేందుకు వెళ్తుండగా.. జూబ్లీహిల్స్ పోలీసుల సహకారంతో వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సమావేశంలో వెస్ట్జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల ౧౯న ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రగ్స్పై సమీక్ష నిర్వహించి, రాష్ర్టాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలని ఆదేశాలు జారీచేశారని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఆ తర్వాత నగరంలో డ్రగ్స్ విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్పై 32 కేసులు నమోదు చేయగా.. అందులో 26 గంజాయికి సంబంధించినవేనని వెల్లడించారు. 389 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, 60 మందిని అరెస్టు చేశామని తెలిపారు. ఆరుగురిపై పీడీయాక్టు ప్రయోగించామని సీపీ వివరించారు