బెంగళూరు: లక్ష రుణం చెల్లించనందుకు కొందరు వ్యక్తులు అక్కాచెల్లెళ్ల దుస్తులు ఊడదీసి వారిపై దాడి చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో ఈ దారుణం జరిగింది. అనేకల్ తాలూకా దొడ్డబొమ్మసంద్ర గ్రామానికి చెందిన ఒక మహిళ తన పిల్లల చదువు కోసం నెరిగ గ్రామానికి చెందిన రామకృష్ణా రెడ్డి నుంచి 30 శాతం వడ్డీకి రూ. లక్ష అప్పు తీసుకుంది. అయితే ఆ అప్పు మొత్తం చెల్లించాలని రామకృష్ణా రెడ్డి డిమాండ్ చేశాడు. దీంతో స్థలం అమ్మిన తర్వాత డబ్బులు చెల్లించేందుకు గ్రామస్తుల సమక్షంలో ఒప్పందం జరిగింది. అయినప్పటికీ రామకృష్ణా రెడ్డి ఊరుకోలేదు. సునీల్ కుమార్, ఇంద్రమ్మతో కలిసి మంగళవారం ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. లక్ష అప్పు తీసుకున్న మహిళ, ఆమె సోదరి దుస్తులు ఊడదీసి వారిని కొట్టారు.
కాగా, బాధిత మహిళలు సర్జాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే తొలుత కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. నిందితులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. మరోవైపు ముగ్గురు వ్యక్తులు కలిసి ఆ మహిళలను కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు స్పందించారు. మంగళవారం రాత్రి బాధిత మహిళలను పిలిపించి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం రామకృష్ణా రెడ్డి, సునీల్ కుమార్ను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి ఇంద్రమ్మను అరెస్ట్ చేయాల్సి ఉంది.