హైదరాబాద్ : ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అభిషేక్ ఉప్పల, అనిల్ కుమార్, అర్జున్ వీరమాచినేని, కిరణ్ రాజ్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిలో అభిషేక్ ఉప్పల, అనిల్ కుమార్ను పోలీసులు అరెస్టు చేయగా, మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. ఫుడ్డింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసు నిందితులను ఏడు రోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ను 2017లో కిరణ్ రాజ్, అతని భార్య లీజుకు తీసుకున్నారు. 2020 వరకు భార్యతో కలిసి కిరణ్ పబ్ను నడిపారు. 2020, ఆగస్టులో అభిషేక్ ఉప్పల, అనిల్కుమార్కు కిరణ్ లీజుకు ఇచ్చాడు. 2022, జనవరి నుంచి పబ్ని అభిషేక్ ఉప్పల, అతని గ్యాంగ్ ఆపరేట్ చేస్తున్నారు. పబ్ను అభిషేక్కు లీజుకు ఇచ్చినప్పటికీ కిరణ్ పార్ట్నర్గా కొనసాగారు. కిరణ్ రాజు, అర్జున్ వీరమాచినేని కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడు అభిషేక్ సెల్ఫోన్ను పోలీసులు సీజ్ చేశారు. అతని ఫోన్లో కీలక సమాచారం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ నిబంధనలను అతిక్రమించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఎంట్రీలో ఆధార్ వివరాలు తీసుకోకుండానే మైనర్లను పబ్లోకి అనుమతించారు. మైనర్లకు లిక్కర్ కూడా ఇచ్చారు. పబ్లో డ్రగ్స్ వాడకానికి అసలు కారణం బర్త్ డే పార్టీ అని తెలుస్తోంది. ఓ బడా బాబు బర్త్డే పార్టీ శనివారం పబ్లో జరగ్గా, ఈ వేడుకకు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు సమాచారం. బర్త్ డే పార్టీ చేసిన బడా బాబు విజ్ఞప్తి మేరకు డ్రగ్స్ తీసుకొచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.