తిరువనంతపురం : కరోనాతో అల్లాడుతున్న కేరళను నిఫా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే 12 సంవత్సరాల బాలుడు వైరస్ బారినపడి మృత్యువాతపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరిలో లక్షణాలు గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ ఆదివారం తెలిపారు. మరణించిన 12 ఏళ్ల బాలుడికి దగ్గరగా ఉన్న 20 మంది హైరిస్ట్ కాంటాక్టుల్లో ఇద్దరూ ఉన్నారని పేర్కొన్నారు. ‘మేమం ఇప్పటి వరకు 188 కాంటాక్ట్లను గుర్తించాం. నిఘా బృందం వారిలో 20 మందిని హై రిస్క్ కాంటాక్టులుగా గుర్తించింది. ఇద్దరిలో లక్షణాలున్నాయి. వీరిద్దరూ ఆరోగ్య కార్యకర్తలు. ఒకరు ప్రైవేటు హాస్పిటల్లో పని చేస్తున్నారు.
మరొకరు కోజికోడ్ మెడికల్ కాలేజీ స్టాఫ్ మెంబర్’ అని వివరించారు. నిఫా వైరస్ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. సాయంత్రం వరకు 20 హై రిస్క్ కాంటాక్టులను కోజికోడ్ మెడికల్ కాలేజీకి బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు, ఇతర కాంటాక్టులు క్వారంటైన్లో ఉండాలని కోరినట్లు చెప్పారు. మెడికల్ కాలేజీ హాస్పిటల్లో పే వార్డు పూర్తిగా నిఫా వార్డుగా మార్చినట్లు పేర్కొన్నారు. ఇవాళ 12 సంవత్సరాల బాలుడు ఆసుప్రతిలో మృతి చెందగా.. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి బాలుడి నమూనాలను పంపగా.. నిఫా వైరస్ సోకినట్లు ధ్రువీకరించారు.