హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): దసరా ప్రయాణికులతో ఆర్టీసీ బస్స్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. రద్దీకి తగ్గట్టుగా టీఎస్ఆర్టీసీ అధికారులు 4,035 ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టారు. గత 8 రోజుల్లో దాదాపు 2.04 కోట్ల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రైవేట్ బస్సులతో పోలిస్తే ఎలాంటి అదనపు చార్జీలు లేకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, ఇతర రాష్ర్టాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రధాన పాయింట్లలో టీఎస్ఆర్టీసీ సీనియర్ సిబ్బందిని నియమించింది. ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తిస్తే వీరు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి బస్సులు వెంటనే వచ్చేలా చూస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు స్థానిక ఆర్టీఏ, పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సొంత వాహనాల్లో (వైట్ నంబర్ప్లేట్ వాహనాల్లో) ప్రయాణికులను తరలించే కార్లు, ఇతర వాహనాల సీజ్ చేస్తున్నారు. గత రెండు రోజుల్లో 19 కార్లను సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. గురువారం ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే అవకాశాలున్నందున 889 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచబోతున్నట్టు తెలిపారు. టికెట్ల ధరలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని, ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు.