న్యూఢిల్లీ : గడిచిన 20 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 1,888 లాకప్డెత్లు చోటు చేసుకున్నాయి. ఆయా కేసుల్లో కేవలం 26 మంది పోలీసులపై నేరం రుజువైనట్లు తేలింది. ప్రస్తుతం కస్టోడియల్ డెత్లు యూపీలో పెరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందట కాస్గంజ్లో అల్తాఫ్ అనే యువకుడు పోలీసుల కస్టడీలో మరణించారు. అదే సమయంలో మంగళవారం కాన్పూర్లో దొంగతనం చేశాడనే అనుమానంతో అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఆసుప్రతి నుంచి బయలుదేరే సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే, పోలీసులే కస్టడీలో సదరు వ్యక్తిని కొట్టి చంపారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
కస్టడీ మరణాలపై తీసుకున్న చర్యలేంటి?
అధికారిక లెక్కల ప్రకారం.. గత 20 సంవత్సరాలో లాకప్డెత్ కేసుల్లో 893 మంది పోలీసులపై కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా 358 మందిపై చార్జిషీట్లు దాఖలయ్యాయి. కానీ, లాకప్ మరణాలకు కేవలం 26 మందిపైనే నేరం రుజువైంది. 20ఏళ్లలో కస్టడీలో చనిపోయిన 1,888 మందిలో 1,185 మందిని ‘రిమాండ్లో ఉంచలేదు’ అని చూపించారు. కస్టడీలో ఉన్న 703 మరణాలను మాత్రమే రిమాండ్ సమయంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా చూపించారు. అంటే గత 20 ఏళ్లలో పోలీస్ కస్టడీలో మరణించిన వారిలో 60 శాతం మందిని మరణానికి ముందు ఒక్కసారి కూడా కోర్టులో హాజరుపరుచలేదని స్పష్టంగా తెలుస్తోంది.
గతేడాది 76 మంది మృతి..
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం.. గతేడాది అంటే 2020లో దేశవ్యాప్తంగా 76 మంది పోలీస్ కస్టడీలో మరణించారు. ఇందులో 15 కస్టడీ మరణాలతో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. మృతుల్లో ఎవరూ దోషులుగా రుజువు కాలేదు. ఎన్సీఆర్బీ డేటా కూడా.. గత నాలుగేళ్లలో కస్టడీ మరణాలకు సంబంధించి 96 మంది పోలీసులను అరెస్టు చేసినట్లు పేర్కొంది. అయినా, దోషులుగా రుజువు కాలేదు.