ఆలయ ఖజానాకు రూ.18,42,882 ఆదాయం
యాదాద్రి, జూన్ 15 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో బుధవారం స్వామి, అమ్మవార్లకు శాస్ర్తోక్తంగా నిత్యారాధనలు నిర్వహించారు. స్వయంభూ ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణం జరిపించారు. దేవేరులను గజవాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ముస్తాబు చేసి ప్రధానాలయ ప్రాకారంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతు నిర్వహించారు. మొదటగా స్వామివారికి సుదర్శన నారసింహహోమం జరిపారు. వేకువ జామున 3.30 గంటలకు స్వామివారి నిత్యపూజలు ప్రారంభమయ్యాయి.
స్వయంభువులకు ఆరాధనలు జరిపి పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు జరిపారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. స్వామివారి సహస్రనామార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరిగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయం ప్రకారం జరిగాయి. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిగాయి. సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు దర్శనాలు కొనసాగాయి. 18వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీవారి ఖజానాకు రూ.18,42,882 ఆదాయం వచ్చినట్లు ఇన్చార్జి ఈఓ రామకృష్ణారెడ్డి తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేయగా, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు స్వామివారి ప్రసాదం అందించారు.
విమాన గోపురం స్వర్ణతాపడానికి రూ.లక్ష విరాళం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సీవీఎన్ శాస్త్రి లక్ష రూపాయల విరాళాన్ని సమర్పించారు. బుధవారం యాదాద్రీశుడిని దర్శించుకున్న ఆయన చెక్కును ఆలయ ఏఈఓ గజవెల్లి రమేశ్బాబుకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మరింగంటి మోహనాచార్యులు పాల్గొన్నారు.