ఈ చట్టం విషయంలో సుప్రీంకోర్టు తన తీర్పు ఇచ్చింది. అయితే, చట్టాన్ని దుర్వినియోగం చేయాలని ధర్మాసనం ఎక్కడా చెప్పలేదు. చట్టాన్ని జాగ్రత్తగా వాడాలని సూచించింది. ఈ చట్టంపై ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టుతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకువెళ్తాం.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)కు కేంద్రం చేసిన సవరణలు సరైనవేనంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ప్రతిపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి విస్తృత అధికారాలు కట్టబెట్టేదిగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాయి. సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యలకు మరింత బలం చేకూర్చేదిగా ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశాయి. ఈ తీర్పును సమీక్షించాల్సిందేనని పేర్కొన్నాయి. ఈ మేరకు టీఎంసీ, డీఎంకే, ఆప్, ఎన్సీపీ, ఎస్పీ, శివసేన, సీపీఎం, సీపీఐ, ఆర్ఎస్పీ, ఎండీఎంకే, ఆర్జేడీ, ఆర్ఎల్డీ, ఐయూఎంఎల్ తదితర 17 విపక్ష పార్టీలు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తామంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, ఈ అంశంపై విస్తృత ధర్మాసనం త్వరలోనే సమీక్ష నిర్వహిస్తుందని నమ్ముతున్నామని పేర్కొన్నాయి.
‘ప్రమాదకరమైన తీర్పు స్వల్పకాలికంగా ఉంటుందని, త్వరలోనే రాజ్యాంగబద్ధమైన నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆశిస్తున్నాం’ అని తెలిపాయి. సుప్రీంకోర్టుపై తమకు గౌరవం ఉన్నదని, అయితే చట్టంలోని లొసుగులను పరిశీలించకుండా తీర్పు ఇవ్వడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించాయి. ఆర్థిక చట్టం సవరణలపై విస్తృత ధర్మాసనం తీర్పు వెలువరించేంతవరకూ ఈ తీర్పు వెలువరించకుండా వేచి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాయి. పీఎంఎల్ఏకు చేసిన సవరణలను కొట్టివేయాలని కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరంతోపాటు దాదాపు 240 మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన కోర్టు చట్ట సవరణలన్నీ సరైనవేనని గత నెల 27న తీర్పు చెప్పింది.
విపక్షాల సంయుక్త ప్రకటన అనంతరం కాంగ్రెస్ నాయకులు జైరాం రమేశ్, అభిషేక్ సింఘ్వీ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుపై సమీక్షను కోరుతామని, దీని కోసం మళ్లీ అత్యున్నత ధర్మాసనాన్నే ఆశ్రయించనున్నట్టు రమేశ్ తెలిపారు. ఇదే అంశంపై విపక్ష పార్టీ నేతలంతా రాష్ట్రపతిని కూడా కలువబోతున్నట్టు వెల్లడించారు. సింఘ్వీ మాట్లాడుతూ.. ‘ఈ చట్టం విషయంలో సుప్రీం తన తీర్పు ఇచ్చింది. అయితే, చట్టాన్ని దుర్వినియోగం చేయమని ధర్మాసనం ఎక్కడా చెప్పలేదు. చట్టాన్ని జాగ్రత్తగా వాడాలని సూచించింది. ఈ చట్టంపై ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టుతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకువెళ్తాం’ అని తెలిపారు.
తీర్పు చెప్పిన రెండు రోజులకే రిటైర్మెంట్
పీఎంఎల్ఏ సవరణ కేసును విచారించిన ధర్మాసనంలో భాగమైన జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ తీర్పు ఇచ్చిన రెండురోజులకే పదవీవిరమణ చేయడం గమనార్హం. మరోవైపు, సీబీఐ పంజరంలో చిలుకలా మారిందని, దాని మాస్టర్ (కేంద్రప్రభుత్వం) ఏం చెబితే అదే పలుకుతున్నదని 2013లో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐకు అసాధారణ అధికారాలు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. అయితే, ప్రస్తుతం పీఎంఎల్ఏ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ ఈడీకి విశేష అధికారాలు కట్టబెట్టడాన్ని కోర్టు సమర్థించడం గమనార్హం.
సవరణలకు ముందు చట్టం ఏం చెబుతున్నది?
పీఎంఎల్ఏ కింద ఆస్తుల స్వాధీనం లేదా జప్తు చేసేందుకు ఈడీ డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్ కంటే పై ర్యాంకు ఆఫీసర్లకు మాత్రమే అధికారం ఉండేది. ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు ఇండిపెండెంట్ అడ్జుడికేటింగ్ అథారిటీ నుంచి ఈడీ ప్రత్యేక అనుమతులను తీసుకోవాల్సి ఉంటుంది. తాజా సవరణలతో ఇవేమీ ఇప్పుడు అవసరం లేదు.
మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఆరోపణలు వస్తే, సదరు వ్యక్తికి తొలుత నోటీసులు జారీ చేస్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తన ఆస్తులు చట్టబద్ధమైనవేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తాజా సవరణలను బట్టి నిందితులకు ఈడీ అధికారులు ఈసీఐఆర్ కాపీని ఇవ్వాల్సిన అవసరంలేదు. ఏ కారణాలతో అరెస్టు చేస్తున్నారో తెలియజేస్తే సరిపోతుంది.
సుప్రీం కోర్టు తీర్పు ఇదీ…
విపక్షాలు అభ్యంతరాలు ఇవే