ఖాట్మాండు : రుతుపవనాల ప్రభావంతో నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో కనీసం 16 మంది మరణించారు. ఆరు జిల్లాల పరిధిలో రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. విదేశీ పౌరులు సహా 16 మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారని, ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా నివేదికలు అందుబాటులో లేవని పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వం రక్షణ, బాధితులకు సామగ్రి అందించడంపై దృష్టి పెట్టినట్లు చెప్పింది.
గత ఆదివారం నుంచి వరదలు, కొండచరియలు విరిగినపడ్డ ఘటనలో ఇప్పటి వరకు 16 మరణాలు నమోదయ్యాయని, 22 మంది గల్లంతయ్యారని మంత్రిత్వశాఖ పేర్కొంది. సింధుపాల్చోక్, మనంగ్ జిల్లాల్లో నివాస గృహాలకు భారీగా నష్టం జరిగింది. శనివారం ఉదయం వరకు సింధుపాల్ చోక్ జిల్లాతో పాటు లామ్జంగ్, మయాగ్డి, ముస్తాంగ్, మనంగ్, పాల్పా, కాలికోట్, జుమ్లా, దైలేఖ్, జజురా, బజాంగ్లో వరదలు రాగా.. కొండచరియలు విరిగిపడ్డాయి.