హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో తెలంగాణ పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్-8 కార్యక్రమం తప్పి పోయిన చిన్నారుల జీవితాల్లో చిరునవ్వులు పూయిస్తున్నది. వారిని అమ్మ ఒడికి చేరుస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా గత 20 రోజుల్లో 1,594 మంది చిన్నారులను కాపాడినట్టు మహిళా భద్రత విభాగం డీఐజీ సుమతి తెలిపారు. వీరిలో 1,053 మంది చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్టు చెప్పారు. మిగిలినవారిని షెల్టర్ హోంలు లేదా చైల్డ్కేర్ సెంటర్లకు పంపుతున్నట్టు వెల్లడించారు. చిన్నారులతో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయిస్తున్న వారిపై 238 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు తెలిపారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, కార్మికశాఖ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఆరోగ్యశాఖ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. జూలై 1 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం నెలాఖరు వరకు కొనసాగుతుందని చెప్పారు.