న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ముఖ్యంగా పలు జిల్లాల్లో కరోనా తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా 150 జిల్లాల్లో కరోనా పాజివిటీ రేటు 15శాతానికి చేరింది. ఈ క్రమంలో లాక్డౌన్ దిశగా ప్రతిపాదనలు వెల్లువెత్తుతుండగా.. ఈ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయి సమావేశంలోనూ ఆరోగ్య మంత్రిత్వశాఖ సిఫారసు చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి కేంద్రం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్రం పేర్కొంది. పలు జిల్లాలో అత్యధిక స్థాయిలో పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
వచ్చే కొన్ని వారాల్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు జిల్లాల్లో లాక్డౌన్ వంటి కఠినమైన చర్యలు చేపట్టాలని మా విశ్లేషణ సూచిస్తుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. గత సోమవారం దేశవ్యాప్తంగా 3.23 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో రోజువారీ అత్యధికంగా 48,700 కేసులు రికార్డయ్యాయి. ఉత్తర ప్రదేశ్లో 33,551, కర్ణాటకలో 29,744 కేసులు తక్కువ జనాభా ఉన్న కేరళ వంటి రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 20శాతం ఉండగా.. మార్చి మధ్య నుంచి క్రియాశీల కేసులు పెరుగుతూ వస్తున్నాయి.
సోమవారం నాటికి 28.8లక్షలకు చేరాయి. ఎనిమిది రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, తమిళనాడులో లక్షకుపైగా క్రియాశీల కేసులు ఉన్నాయని.. మొత్తం కేస్ లోడ్లో 69శాతం ఉన్నాయి. సెకండ్ వేవ్లో కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్న పాజిటివిటీపై ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ఆరోగ్య వ్యవస్థలపై భారపడుతోంది. అనవసరమైన కదలికలను పరిమితం చేయాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది.