హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నూతనంగా మరో 8 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతివ్వడంతో రాష్ట్రం లో వైద్యవిద్య మరోస్థాయికి చేరుకొన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రూ. 1,479 కోట్లతో 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేయడం సంతోషించదగ్గ విషయమని ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు, అందుకు సహకరించిన వైద్యశాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
నేతన్నకు బీమా.. మరో అద్భుత సంక్షేమ పథకం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన నేతన్నకు బీమా పథకాన్ని అద్భుత సంక్షేమ పథకంగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ‘మానవ మనుగడకు రైతన్న తర్వాత ముఖ్య భూమిక నిర్వహించేది నేతన్న. అటువంటి నేతన్నకు ఆపద వస్తే ఆదుకునేందుకు కేసీఆర్ సర్కార్ మానవీయ కోణంలో రైతుబీమా తరహాలో తెస్తున్న మరో అద్భుతమైన సంక్షేమ పథకం నేతన్నకు బీమా’ అని అన్నారు.