మంగళూరు : జాలర్లు ప్రయాణిస్తున్న మర పడవను నౌక ఢీకొట్టడంతో తునాతునకలై 12 మంది గల్లంతయ్యారు. మంగళూరు తీర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
కేరళలోని కోజికోడ్ సమీపంలోని బేపూర్ నుంచి 14 మంది మత్స్యకారులు పడవ (ఐఎస్బీ రబా)లో సముద్రంలోకి వెళ్లినట్లు భారత తీర భద్రతా దళం తెలిపింది.
ప్రమాదం అనంతరం వీరిలో ఇద్దరు ఆచూకీ లభించగా.. మిగిలిన వారు కనిపించకుండా పోయారు. గల్లంతైన మత్స్యకారులు తమిళనాడు, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.
నౌక ఢీకొన్న వేగానికి మర పడవ పూర్తిగా ధ్వంసమైంది. తీర దళం నౌకలు, హెలికాప్టర్లు ఘటనాస్థలానికి చేరుకొని గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి