బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి
బోడుప్పల్, మార్చి17: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో వంద పడకల దవాఖాన నిర్మాణానికి రూ.50లక్షలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సామగ్రి కొనుగోలుకు రూ.3లక్షలు , రా చెరువు అభివృద్ధి, నాలా నిర్మాణం పొడిగింపునకు మరో రూ.4కోట్లు కేటాయించేందుకు కౌన్సిల్లో సభ్యులు ఆమోదించారు. పది బస్స్టాప్ల నిర్మాణం, బోడుప్పల్ నగరానికి 7 ముఖద్వారాల నిర్మాణానికి సభ ఆమోదం లభించింది. నగరంలోని పలు సర్వే నంబర్లు ఇండస్ట్రీయల్ జోన్లో ఉన్నాయని, వాటిని రెసిడెన్షియల్ జోన్లుగా మార్చడానికి సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపడానికి తీర్మానించినట్లు పేర్కొన్నారు. 2022 హరితహారానికి రూ.5.93కోట్లు, పరిశుభ్రత, శానిటేషన్లో సామగ్రి కొనుగోలుకు రూ.73.5 లక్షలు కేటాయింపునకు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు.