చెన్నై: పుదుచ్చేరి, కరైకాల్ రీజియన్లలో తమిళనాడు బోర్డుకు అనుబంధంగా నడుస్తున్న పాఠశాలలు, కళాశాలల్లో 10, 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాయకుండానే పాసయ్యారు. ఈ మేరకు పుదుచ్చేరి సర్కారు ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు బోర్డు మార్గదర్శకాల మేరకే ఆ బోర్డు పరిధిలోని స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న 10, 11 తరగతుల విద్యార్థులు పాసైనట్లు డిక్లేర్ చేశామని పుదుచ్చేరి ప్రభుత్వం తెలిపింది.
అయితే, ఆ రెండు రీజియన్లలోని తమిళనాడు బోర్డు అనుబంధ పాఠశాలలు, కళాశాలలు మినహా మిగతా బోర్డుల పరిధిలోని స్కూళ్లు, కాలేజీల్లో 10, 11, 12 తరగతుల విద్యార్థులకు మాత్రం ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగేవరకు క్లాసులు నడుస్తాయన్నారు. అదేవిధంగా, పుదుచ్చేరిలోని స్కూళ్లలో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులంతా కూడా పాసైనట్లేనని పుదుచ్చేరి సర్కారు డిక్లేర్ చేసింది. అయితే వారికి కూడా తరగతులు మార్చి 31 వరకు కొనసాగుతాయని, ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులని తెలిపింది.