బీజింగ్: క్వారంటైన్ నుంచి తప్పించుకుని నిబంధనలను ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో పొరుగున నివసించే వేలాది మందిని అధికారులు బలవంతంగా క్వారంటైన్ చేశారు. చైనా రాజధాని బీజింగ్లో ఈ సంఘటన జరిగింది. ఆ దేశాన్ని ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తున్నది. దీంతో రాజధాని బీజింగ్లో గత ఐదు వారాలుగా ప్రజలను ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. అయితే 40 ఏళ్ల వ్యక్తి హోమ్ ఐసొలేషన్ నిబంధనలను ఉల్లంఘించాడు. కరోనా హైరిస్క్ జోన్గా ప్రకటించిన ఒక షాపింగ్ సెంటర్కు అతడు వెళ్లాడు. అలాగే తన ఇంటి చుట్టుపక్కల తిరిగాడు.
ఆదివారం ఆ వ్యక్తి కుటుంబానికి కరోనా పరీక్ష నిర్వహించగా అతడితోపాటు భార్యకు పాజిటివ్గా తేలింది. దీంతో పొరుగున ఉన్న ఐదు వేల మంది ప్రజలను నిర్బంధ హోమ్ ఐసొలేషన్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. 250 మందిని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
కాగా, బీజింగ్లో కరోనా కేసులు తగ్గుతుండటంతో సోమవారం నుంచి ఆంక్షలను సడలించారు. ఆఫీసులు, బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. సూపర్ మార్కెట్లు, సినిమా థియేటర్లు, పార్కులు, మ్యూజియంలను తెరిచారు. అయితే వీటిలో ప్రవేశంతోపాటు బహిరంగ ప్రదేశాలకు వెళ్లేందుకు కరోనా నెగిటివ్ రిపోర్ట్ను తప్పనిసరి చేశారు. మరోవైపు బీజింగ్లో స్కూళ్ల మూసివేత ఇంకా కొనసాగుతున్నది.