అమరచింత/శ్రీశైలం/నందికొండ/కేతేపల్లి/మెండోరా, ఆగస్టు 8 : ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. సోమవారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు 43 వేల క్యూసెక్కులు ఇన్ఫ్లో, 43,333 క్యూసెక్కుల అవుట్ఫ్లోగా నమోదైంది. శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద వస్తున్నది. సోమవారం ఉదయం వరకు మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తర్వాత ఇన్ఫ్లో తగ్గడంతో ఒక్క గేటు మాత్రమే తెరిచి ఉంచారు. ఇన్ఫ్లో 1.40 లక్షల క్యూసెక్కులు, అవుట్ఫ్లో 83,071 క్యూసెక్కులు నమోదైంది.
శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో వస్తుండటంతో నాగార్జునసాగర్ నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. సోమవారం 83,071 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 35,571 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకు గాను ప్రస్తుతం 574.80 (268.6178 టీఎంసీలు) అడుగులకు చేరింది. మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 11,747 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 40,910 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. నాలుగు వరద గేట్ల ద్వారా 16,656 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు వదులుతున్నారు.
మహదేవపూర్, ఆగస్టు 8 : కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బరాజ్కు వరద పోటెత్తింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదీ ప్రవాహం పెరిగి బరాజ్లోకి వరద పెరుగుతూ వస్తున్నది. ఆదివారం బరాజ్కు 3,37,910 క్యూసెక్కుల ప్రవాహం రాగా, సోమవారం 4,96,370 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో బరాజ్లోని 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.