గ్రామాధికారి పరంధామయ్య సుస్తీ చేసి మంచాన పడ్డాడు. ఒకరోజు ఆయన తన ముగ్గురు కొడుకుల్నీ పిలిచి ‘ఒరేయ్ అబ్బాయిలూ.. ఇక నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు. కాబట్టి నా దగ్గరున్న డబ్బు, బంగారం, పొలం మీకు పంపకం చెయ్యాలనుకుంటున్నాను. ఎవరెవరికి ఏమి కావాలో నిర్ణయించుకుని నాకు చెప్పండి’ అన్నాడు. వెంటనే మూడో కొడుకు సుందరం భార్య.. తన భర్తను గదిలోకి పిలిచి ‘మీరు బంగారం తీసుకోండి. అది పాతకాలం బంగారం. మేలైన రకం, ఎప్పటికైనా మంచి ధర పలుకుతుంది’ అని చెప్పింది. సుందరం భార్య మాటకు ఎదురు చెప్పలేక తండ్రి దగ్గరకెళ్లి తనకు బంగారం కావాలన్నాడు. రెండో కొడుకు గోపాలం భార్య కూడా భర్తను లోపలికి పిలిచి ‘మీరు డబ్బు తీసుకోండి. ఎంచక్కా పట్నం వెళ్లి ఏదైనా వ్యాపారం చేసి ధనవంతులం కావచ్చు. మంచి బంగళా కొనుక్కోవచ్చు.
ఈ పల్లెటూర్లో నేను ఉండలేను బాబూ’ అంది. గోపాలం కూడా భార్య మాటకు విలువనిచ్చి తండ్రితో తనకు డబ్బు కావాలన్నాడు. పాపం అమాయకుడైన కామేశం మాత్రం, తన వాటాగా మిగిలిన బంజరు పొలాన్ని తీసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ కష్టపడి దాన్ని వ్యవసాయ భూమిగా చేసుకుని, చక్కని పంటలు పండించుకున్నారు. కొద్దికాలానికే పరంధామయ్య కాలం చేశాడు. డబ్బు తీసుకుని పట్నం వెళ్లిన గోపాలం వ్యాపారం ప్రారంభించాడు. అనుభవం లేనందువల్ల కొద్దిరోజులకే నష్టం రావడం మొదలైంది. దాంతో దివాలా తీశాడు. భార్యను తీసుకుని సుందరం పట్నంలో కాపురం పెట్టాడు. సుందరం భార్యకు బంగారమంటే మహా మోజు. రోజుకొక నగ సింగారించుకొని ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్లి గొప్పగా ప్రదర్శించేది.
ఇదంతా బాగా గమనించిన దొంగలు ఒకరోజు అర్ధరాత్రి ఇంట్లో చొరబడి ఉన్న బంగారమంతా దోచుకెళ్లారు. ఇద్దరూ లబోదిబోమని ఏడుస్తుంటే ఇరుగుపొరుగు వచ్చి ఓదార్చారు. సుందరం, గోపాలం ఇద్దరూ బతుకుదెరువు లేక అన్న దగ్గరకొచ్చి బావురుమన్నారు. భార్యల మాటలు విని.. బంజరు భూమిని అన్నకు అంటగట్టి తమ స్వార్థం తాము చూసుకున్నందుకు తగినశాస్తి జరిగిందని ఇద్దరూ పశ్చాత్తాపపడ్డారు. సిగ్గుతో తలవంచుకుని అన్నకు క్షమాపణ చెప్పుకున్నారు. ముగ్గురూ కలిసి వ్యవసాయం చేసుకుంటూ కలిసిమెలిసి జీవించారు. అందుకే స్వార్థ చింతన ఉండకూడదు. క్షణికమైన లాభాలను ఆశించకూడదు. దీర్ఘకాలిక దృష్టి అవసరం.