సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): నాలుగు నెలల తర్వాత గాంధీ వైద్యశాలలో మళ్లీ సాధారణ సేవలు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో వైద్యశాలను పూర్తిగా కొవిడ్ సెంటర్గా మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైరస్ అదుపులోకి రావడంతో నాన్కొవిడ్ సేవలు పునరుద్ధరించేందుకు చర్యలు ముమ్మరం చేసినట్లు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు స్పష్టం చేశారు. 3 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని చెప్పారు.
తొలి దశ కరోనా సమయంలో పూర్తిస్థాయి నోడల్ కేంద్రంగా పనిచేసిన గాంధీలో ఎనిమిది నెలల విరామం తర్వాత నాన్కొవిడ్ సేవలను పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు దశ తదనంతర పరిణామాల అనంతరం ప్రస్తుతం వైద్య సేవలు పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే దవాఖానను రెండు జోన్లుగా విభజించారు. అందులో ఒకటి గ్రీన్. రెండోది రెడ్జోన్. గ్రీన్ జోన్లో సాధారణ రోగులకు వైద్యసేవలు అందిస్తారు. రెడ్జోన్లో కరోనా రోగులకు చికిత్స చేస్తారు. ఈ రెండు బ్లాక్లు పూర్తిగా వేర్వేరుగా ఉంటాయి. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు సైతం వేరే. ఇప్పటికే దవాఖానలోని వార్డులన్నీ ఫిమిగేషన్(క్రిమి సంహారక చర్య) చేశారు. సాధారణ రోగులు కొవిడ్ బ్లాక్లోకి వెళ్లకుండా, కొవిడ్ పేషెంట్లు, వారి సహాయకులు సాధారణ బ్లాక్లోకి పోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
గాంధీలో ప్రారంభం కానున్న గ్రీన్జోన్ పరిధిలోని సాధారణ చికిత్సల విభాగంలో కచ్చితమైన నియమాలను రూపొంచించడంతో పాటు వాటిని కఠినంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రోగి వెంట ఒకే సహాయకుడిని అనుమతిస్తారు. అంతే కాకుండా మాస్కులేని వారిని అనుమతించారు. ఓపీ, ఇతర విభాగాల్లో భౌతిక దూరం తప్పనిసరి పాటించేలా చర్యలు తీసుకున్నారు. దవాఖాన ప్రాంగణంలో ఉమ్మివేయడాన్ని పూర్తిగా నిషేధించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడపడితే అక్కడ ఉమ్మితే వారికి జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గాంధీ హాస్పిటల్లో నాన్కొవిడ్ సేవలను పునఃప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశాం. హాస్పిటల్లోని వార్డులన్నీ క్యుమిగేషన్ జరిపించాం. కొవిడ్, నాన్కొవిడ్ రోగులకు వేర్వేరు ఎగ్జిట్, ఎంట్రీలు ఉండే విధంగా చర్యలు చేపట్టాం. ఐసీయూ, ఆపరేషన్ థియేటర్స్ తదితర అన్ని రకాల వైద్య, ల్యాబ్ సేవలను పూర్తిగా వేర్వేరుగా ఉండేలా చేశాం. సాధారణ రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాం.- డాక్టర్ రాజారావు,
సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన
గ్రీన్జోన్లో వెయ్యి పడకలతో సాధారణ వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా 250 బెడ్ల సామర్థ్యంతో ఐసీయూ, 40 ఆపరేషన్ థియేటర్లను సిద్ధం చేయగా, 500 బెడ్లు, వీటితో పాటు 50 పడకలతో ఐసీయూ వార్డును కొవిడ్ సేవలకు కేటాయించారు. మరో 50 పడకల ఐసీయూ వార్డును అత్యవసర పరిస్థితుల కోసం అదనంగా ఏర్పాటు చేశారు. రెండు ఆపరేషన్ థియేటర్లను కూడా అందుబాటులో ఉంచారు.