దూపయినప్పుడే బాయి తవ్వినట్టు.. అని తెలంగాణలో ఒక సామెత. సమస్య వచ్చినప్పుడు ఆలోచించడం కాదు, రాకముందే సిద్ధపడాలి. అదే కేసీఆర్ తరహా పాలన. 2014లో పోలింగ్ ముగియగానే విద్యుత్ రంగ నిపుణుడు దేవులపల్లి ప్రభాకర్రావుతో కేసీఆర్ సమావేశమై, విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దడంపై చర్చించారు. ఇంకా ఫలితాలు రాకముందే, తన పరిపాలనకు ఆయన సిద్ధమయ్యారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఆయన ఉద్యమకాలంలోనే బ్లూప్రింట్ సిద్ధం చేసుకున్నారు. పరాయిపాలనలో తెలంగాణలో అన్ని రంగాలు అస్తవ్యస్తంగా ఉండేవి. అందులో వైద్యరంగం కూడా ఒకటి. కేసీఆర్ వైద్య వ్యవస్థను పటిష్టం చేయడం వల్లనే కరోనా మహమ్మారిని తట్టుకొని నిలువగలిగాం. నీటి పారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయకపోతే, నదుల అనుసంధానం పేరిట మన గోదావరి బేసిన్ నీళ్ళు కావేరీ బేసిన్ వరకు తరలిపోయేవి. నీటిపారుదల ప్రాజెక్టులను కేంద్రం స్వాధీనం చేసుకోక ముందే కేసీఆర్ వేగంగా పావులు కదిపారు. భవిష్యత్తులో కరువు ఏర్పడి నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని అంటున్నారు. వానలు క్రమపద్ధతిలో పడవు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇంకా వందేండ్లయినా తెలంగాణకు ఇబ్బంది లేకుండా కేసీఆర్ అతివేగంగా ప్రాజెక్టులు నిర్మించి పెట్టారు. ఇదీ ముందుచూపు అంటే?
గోల్కొండ కోట తెలంగాణ ప్రజల స్వాతంత్య్ర వేడుకలకు వేదిక కావడం హర్షణీయం. తానీషా ప్రభువుకు శ్రీరామ, లక్ష్మణులు సాక్షాత్కరించింది గోల్కొండ కోటలోనే. భక్త రామదాసు నోట వెలువడిన సుప్రసిద్ధ కీర్తనలెన్నో ప్రతిధ్వనించింది ఈ కోటలోనే. తెలంగాణ బోనాల పండుగ కూడా గోల్కొండ కోట నుంచే ప్రారంభమవుతుంది.
– కేసీఆర్