న్యూఢిల్లీ: వరుసగా రెండు రోజులు సెలవులు, అటుపై ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో దేశవ్యాప్తంగా శనివారం నుంచి వరుసగా నాలుగు రోజులు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. శనివారం రెండో శనివారం, ఆదివారం సెలవుదినాలు.. బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా సోమ, మంగళవారాల్లో బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.
మార్చి 13వ తేదీ రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులూ బ్యాంకులు పనిచేయవు. 15, 16 తేదీల్లో సమ్మె వల్ల ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథాతథంగా పనిచేయనున్నాయి.
రెండు ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ఒక ప్రభుత్వరంగ బీమా సంస్థను ప్రైవేటీకరిస్తామని గత నెల ఒకటో తేదీన పార్లమెంట్కు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఈ క్రమంలో తొమ్మిది యూనియన్లతో కూడిన ది యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) సమ్మె తలపెట్టింది. 10 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా. సమ్మె వల్ల ఎస్బీఐ, కెనరా వంటి ప్రభుత్వ రంగ బ్యాంల నుంచి వినియోగదారుల సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే సమ్మెలో అఖిల భారత ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), అఖిల భారత అధికారుల కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), అఖిలభారత ఉద్యోగుల సంఘం (ఐఐబీవోఏ), బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (బెఫీ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఐఎన్బీఈఎఫ్), ఫెడరేషన్ ఆఫ్ కెనరా బ్యాంక్ తదితర సంఘాల సభ్యులు సమ్మెలో పాల్గొంటారు.