జన నుతుడు విదురునితో విద్వజ్జన నుతుడు మైత్రేయుడు విధాత విరచించిన సృష్టి విశేషాలను ఇలా వివరించాడు. మానవ సృష్టి క్రమంలో హిరణ్యగర్భుడు (బ్రహ్మ) తన హృదయం- ఆత్మనుండి మన్మథుణ్ణి పుట్టించాడు. బ్రహ్మ ముఖములో నుంచి సరస్వతి- బ్రాహ్మీశక్తి పుట్టింది.
సౌందర్యరాశి అయిన శారదను చూచి సరోజభవుడు బ్రహ్మ సమ్మోహ పరవశుడయ్యాడు. ‘బ్రహ్మకైన బుట్టు రిమ్మ తెగులు’- కన్న కూతురన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వావి వరుసలు వదలి పాపానికి వెరవక విటునివలె వ్యామోహంలో విరిబోణి వాణి వెంట పడ్డాడు విధాత. తమ తండ్రి తెంపరితనం తెలుసుకొని తనయులు మరీచి, వశిష్ఠుడు, అత్రి మొదలగు ముని ముఖ్యులు ఇలా మందలించారు-
‘ఓ చతురాననా! చాలు చాలు. శీల సదాచారాన్ని కాలదన్ని కన్నుమిన్ను కానక కన్న కూతురునే కవయ (కలియ) కోరావు. ఇదేమి ధర్మమయ్యా? ఇంతటి పాపానికి పాల్పడతావా? నీ పెద్దరికాన్ని పాతరేశావు. నీ నీతి నియమాలను నేలపాలు చేశావు. నలువా! నీ వలె విలువల వలువలూడ్చి నవ్వుల పాలైనవారు మునుపు- గతంలో ఎవ్వరైనా ఉన్నారా? పరమేష్ఠీ! సృష్టికర్తవై కూడా ఇట్టి నికృష్టమైన పాపిష్టి పనికి పూనుకొని ‘కామాంధోనైవ పశ్యతి’- ‘కామానికి కళ్లుండవు’ అన్న సామెతను సార్థకం చేశావు’.
ఇలా మునులు పలికిన ఈటెల వంటి మాటలు విని విరించి తలలు వంచుకొన్నాడు. వెనువెంటనే ఆ శరీరాన్ని విసర్జించాడు. నిషిద్ధమూ, నిందనీయమూ కాని ధర్మబద్ధమైన కామంపై కోరిక కల మరొక దేహాన్ని ధరించాడు. అయినా, ఆశించిన విధంగా ప్రజావృద్ధి- సృష్టి జరుగలేదు. ఆశ్చర్యపడి ఆదిదేవుని ధ్యానించి, ఆరాధించాడు. అనంత భగవానుడు అనుకూలుడు కాగా అరవిందభవుని-బ్రహ్మగారి దేహం రెండు అర్ధభాగాలయింది. దక్షిణభాగం సార్వభౌమ సమ్రాట్టు స్వాయంభువ ‘మనువు’గా, వామభాగం అతని అర్థాంగి ‘శతరూప’ అనే అంగనామణిగా రూపొందాయి. వీరే ఆది మిథునం- మైథున (స్త్రీ పురుష సంగమ) సృష్టికి శ్రీకారం. ఈ ఆదిదంపతుల అనంత ప్రజా సంతతివల్ల జగత్తంతా నిండి నిబిడీ కృతమయింది. ‘క’ అని బ్రహ్మకు నామం. ఆయన నుంచి విభక్తమై- విడి పడి వచ్చింది కాన శరీరానికి ‘కాయం’ అని పేరొచ్చింది.
సృష్టి విజ్ఞాత, వేదరాశి నిర్ణేత, కల్మష జేత, సకల లోక శుభ ప్రదాత అయిన ధాత (బ్రహ్మ)కు మోహావేశమా! అందరి తలరాతలు వ్రాసే విధాత అయి కూడా ఇంతటి దురాగతమా? దీన్నికూడా ‘విధి వ్రాత’గానే భావించాలా? బ్రహ్మకుకూడా భ్రమ కలిగిందే! నా మాయ నిన్ను ఆవహించదని పరమాత్మ ప్రజాపతి (బ్రహ్మ)ని అనుగ్రహించి, ఆశీర్వదించాడు కదా! ఆ ఆశీస్సులు అసత్యాలైనట్లేగా! అంటే అలా కాదు. అర్థవాద రూపమైన పురాణ శైలి అవగాహన లేకపోతే ఇలాంటి అపార్థాలకు ఆస్కారం ఏర్పడుతుంది. మనమే భ్రమించి మోహగ్రస్తులమవుతాము. బ్రహ్మదేవుడనగా ఎవరు? వ్యష్టి (ఇండివిడ్యువల్) సూక్ష్మ శరీరాల (మనస్సుల) సమష్టి (యూనివర్సల్) స్వరూపమే బ్రహ్మ. కాన, సర్వవిధ శుభ, అశుభ సంస్కారాలు బ్రహ్మనుంచే వ్యక్తమవుతాయి. సమష్టి సంస్కార రాశియే బ్రహ్మ ఉపాధి (శరీరం). సృష్టిలో ధర్మ విరుద్ధమైన కామానికి లొంగిపోయే కాముకులు, మహా భయంకరులు ఎందరో ఉన్నారు గదా! ఈ దుర్వృత్తికి దృష్టాంతమే ద్రుహిణుని (బ్రహ్మదేవుని) దుష్ప్రవృత్తి. కాన, ఎంతటి మొనగాడైనా మనస్సును నమ్మరాదన్న గొప్ప హెచ్చరిక కూడా ఇది!
‘ఓ పద్మాక్షీ! పరమ యోగికైనా సరే ప్రబలమైన ఇంద్రియాలు ఎంతో కీడు-పీడ కల్గిస్తాయి. అందుకే, అమ్మ కూతుళ్లయినా సరే, అక్క చెల్లెండ్రయినా సరే, పురుషుడు వారితో కలిసి ఒకే పాన్పుమీద కూర్చొనరాదు’ అని యయాతి చక్రవర్తి దేవయానికి చేసిన దివ్యబోధ.
శ్రీ శుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! మైత్రేయ మహర్షి విదురునికి హిరణ్యాక్ష-హిరణ్యకశిపుల జన్మ వృత్తాంతం ఇలా వివరించాడు- కశ్యప ప్రజాపతి పత్ని దితి దక్షప్రజాపతి పుత్రిక. పరమార్థంలో ద్వైతబుద్ధికి సంకేతం భోగ లాలస. ఒకనాటి సంధ్యాసమయం- ప్రదోషకాలంలో దితి తన పతిని రతిక్రీడకు నిర్బంధించింది.
భాగవతంలో బాదరాయణుడు-వ్యాసుడు వాడిన భాష చాలా గూఢమైనది. వల్లభాచార్యులు దానిని ‘సమాధి భాష’ అన్నారు. ‘కశ్యపః’ శబ్దానికి ‘పశ్యకః’ అని అక్షర విపర్యయం చేసి అర్థం చెప్పుకోవాలి. పశ్యకః అనగా చూచువాడు- ‘సాక్షి’ అని అర్థం. ‘అదితి’ అంటే అద్వైత బుద్ధికి సంకేతం. కశ్యపుడు అదితి, దితి అక్క చెల్లెళ్లిద్దరికీ భర్తే. మంచి చెడ్డలు రెంటినీ ప్రకాశింపజేసే సాక్షి పరమాత్మే పశ్యకుడంటే- అని వ్యాఖ్యాతలు వివరించారు. బీజం- విత్తనం ఒకటే అయినా క్షేత్రం-భూమి యొక్క సంస్కారాన్ని అనుసరించి పండే పంటయొక్క వాసి (క్వాలిటీ)లో వైవిధ్యం-తేడా ఉంటుంది. దితి పుత్రులు దైత్యులు కాగా, అదితి పుత్రులు ఆదిత్యులు- దేవతలయ్యారు.
ఈ సందర్భంలో సహజ పాండిత్యుడు పోతన దితి, గతి, మతి, ధృతి, పతి, సతి అనే ‘తి’కారాంత పదాలను అందంగా అతికించి వీనుల విందుగా ఒక కందపద్యం అందించాడు-
విదురా! కామం చేత సమ్మోహింపబడిన మతి (బుద్ధి) కలిగిన దితి అతిదీనంగా అనేక మారులు అర్థించింది. అప్పుడు ధృతి- ధైర్యవంతుడైన కశ్యపుడు ఆర్తితో వచ్చిన పతివ్రత అయిన తన సతి దితిని అనునయిస్తూ ఇలా పలికాడు-
సరోజముఖీ! ఇది సంధ్యాసమయం, ప్రదోష- ప్రకృష్టమైన దోషాలతో కూడిన కాలం. ఈ సమయంలో దివాకరుడు (సూర్యుడు) అస్తమిస్తూ ఉండడం చేత, ఉదయిస్తూ ఉండడం చేత నిశాకరుడు (చంద్రుడు)- ఇద్దరూ తేజోహీనంగా ఉంటారు. చంద్ర సూర్యులు మానవుల మనోబుద్ధులకు ప్రేరకులు- చోదకులు. మనోబుద్ధులను కామం పట్టి పీడించే ఈ సమయం మహా ప్రమాదకరం. ఈ కాలంలో అప్రమత్తతతో ఆదిదేవుని ఆరాధించాలి. సంధ్యావందన సంకీర్తనలు, గాయత్రీ జపతపాదులు, స్తోత్ర పఠనాలు, గృహాలలో దేవాలయాలలో దీపారాధనలు చెయ్యాలి. వీని వలన అంతఃకరణ శుద్ధి. సంధ్యాకాలంలోను, పవిత్ర పర్వదినాలలోను స్త్రీ-పురుష సాంగత్యాన్ని వాత్స్యాయనుడు (కామ శాస్త్రకారుడు) నిషేధించాడు. ఈ ఘోరవేళలో ఆహారాన్ని, నిద్రను, మైథునాన్ని విసర్జించాలని శంఖ స్మృతి.
కశ్యపుడన్నాడు- ‘ఓ దేవీ! ఒక్క ముహూర్త కాలం వేచి ఉండు. పరమశివుడు ప్రమథ గణాలతో వృషభ వాహనంపై వియత్తలం (ఆకాశం)లో వీర విహారం చేసే సమయమిది. ఇప్పుడు సంగమిస్తే శంకరస్వామిని అవమానించినట్లవుతుంది. అకారణంగా అభవుని (శివుని) ఆగ్రహానికి ఎందుకు గురి కావాలి?’ ఇలా పతి బోధించినా దితి మతి విని పాటించే స్థితిలో ఉంటే గదా! ఆమె సహనం కోల్పోయి వారకాంత వలె తన కాంతుని వస్త్రం పట్టి లాగింది. ఈ నిర్బంధాన్ని నిరోధించలేక కశ్యప ప్రజాపతి పరమేశ్వరునికి ప్రణామం చేసి ఏకాంతంలో తన కాంత కోరికను తీర్చాడు.
నీవు చేసిన విపరీత కర్మవల్ల నీకు ఉగ్రకార్యాలు చేస్తూ సజ్జనులను బాధించే భయంకర బలవంతులు ఇద్దరు దైత్యులు పుడతారని పలికాడు ప్రజాపతి దితితో. వారే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు- సనత్కుమారులచే శపింపబడి వైకుంఠం నుంచి పతితులైన శ్రీహరి ద్వారపాలకులు జయ విజయులు.
ఉ.‘చాలు! బురే! సరోజభవ! సత్పథ వృత్తి దొఱంగి కూతు ని ట్లాలరివై రమింప హృదయంబున గోరుట ధర్మరీతి యే?బేలరివైతి, నీ తగవు, బెద్దతనంబును నేలపాలుగా శీలము వోవ దట్టి యిటు సేసిన వారలు మున్ను గల్గిరే?’
ఆ.‘అక్క తల్లి చెల్లె లాత్మజ యెక్కిన పానుపెక్కం జనదు పద్మనయన పరమ యోగికైన బలిమిని నింద్రియ గ్రామ మధిక పీడ గలుగంజేయు.’
క.‘దితి యీ గతి కామ విమో హితమతి బహు వచనముల హృదీశుని బలుకన్ ధృతి గృపణ బతివ్రత నిజ సతి గని కశ్యపుడు పలికె సల్లాపమునన్.’
మ.‘తరుణీ! యొక్క ముహూర్త ముండు మిది సంధ్యాకాల మిక్కాల మందరయన్ భూత గణావృతుండగుచు గామారాతి లీలన్ వృషేశ్వర యానంబున సంచరించుట నభావ్యంబయ్యె నీ యుగ్రవేళ రమింపంగ నిషిద్ధ కర్మమగు నేలా ధర్మమున్ వీడగన్’.
నాటకీయ (కృత్రిమమైన) భక్తి ‘నిజమైన భక్తి’ కాదు. ‘ఆధ్యాత్మిక పురోగతి’లో వివిధ దశలను అధిగమించడం అంత తేలికా కాదు. అత్యంత కఠినమైన, శక్తివంతమైన ‘అసలైన జ్ఞానం, వాస్తవిక భక్తి’తోనే అది సాధ్యం. సుదీర్ఘకాలం, నిరంతరాయంగా ఒకటి తర్వాత ఒకటిగా సాధన చేసినప్పుడే దానంతటది (ఆటోమేటిక్గా) మన సొంతమవుతుంది!
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006