కేసముద్రం, ఆగస్టు 1: వావివరసలు మరిచిన అన్నాచెల్లె సహజీవనం సాగిస్తూ అడ్డుగా ఉన్నదని ఆరేండ్ల పాపను బలితీసుకున్నారు. అనారోగ్యంతో చనిపోయినట్టు బుకాయించగా, గ్రామస్థుల జోక్యంతో దారుణం వెలుగుచూసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో కొన్నేండ్ల క్రితం వివాహమైంది. వారికి కూతురు అనుశ్రీ (6) ఉన్నది. సదరు యువతి సొంత అన్నతో వివాహేతర సంబంధం పెట్టుకున్నది.
ఆమె భర్తను వదిలి సోదరుడితో ఐదేండ్ల్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి భువనగిరి సమీపంలోని ఓ కోళ్లఫారంలో కలిసి పని చేస్తూ సహజీవనం మొదలుపెట్టారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. వారి సంబంధానికి అడ్డుగా ఉంటుందని అనుశ్రీని అంతమొందించారు. కడుపు నొప్పితో చనిపోయిందని గత బుధవారం రాత్రి బాలిక మృతదేహాన్ని తల్లిగారి ఇంటికి తీసుకొచ్చారు.
అనుమానంతో గ్రామస్థులు 100కి ఫోన్చేసి సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి మృతదేహాన్ని గురువారం పోస్టుమార్టం కోసం తరలించారు. రిపోర్టులో గొంతు నులమడం ద్వారానే బాలిక మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లిని, ఆమె సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిసింది.