తొలిసారి జేఎల్ఎంలుగా మహిళల నియామకం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 25 మంది ఎంపిక
మొక్కవోని దీక్షతో ముందుకు
ఓదెల, అక్టోబర్ 21;‘అవనిలో సగం..అన్నింటా అగ్రభాగం’ అనే సూక్తి స్ఫూర్తితో అతివలు అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారు.. పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ అగ్రభాగాన నిలుస్తున్నారు.. ఇదే కోవలో ట్రాన్స్కోలో జూనియర్ లైన్ఉమెన్గా ఎంపికై సత్తా చాటేందుకు ఉత్సాహంగా కదులుతున్నారు..
అధునాతన టెక్నాలజీతో మానన జీవన విధానాల్లో అనేక మార్పులు వచ్చాయి.. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్నింటా ముందుంటున్నారు. ఇంతటి పురోగతి సాధించినా కొన్నిరంగాల్లో అవకాశాలు దక్కలేదు. ఇందులో విద్యుత్ రంగంలో స్తంభాలు, టవర్లు ఎక్కి మరమ్మతులు చేసే అవకాశం దొరకలేదు. ఈ పోస్టుల భర్తీలో అతివలకు చోటు దక్కలేదు. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటా సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. మహిళలకు అన్నింటా అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలిసారిగా ట్రాన్స్కోలో జేఎల్ఎం ఉద్యోగాల్లో మహిళలకు అవకాశమి చ్చింది. 2017లో జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్లో రిజర్వేషన్లకు అనుగుణంగా మహిళలకు 33 శాతం కోటా కేటాయించింది. విద్యార్హతలను నిర్దేశించింది.
పట్టుబట్టి కొలువు కొట్టింది..
జూలపల్లి, అక్టోబర్ 21: మండలంలోని కుమ్మరికుంటకు చెందిన బండారి సుమలతది నిరుపేద కుటుంబం..కష్టపడి చదివి పెద్దపల్లిలో ఐటీఐ పూర్తి చేసింది.. కుమ్మరికుంట గ్రామానికి చెందిన 27 ఏండ్ల బండారి సుమలత సాధారణ మహిళ. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె పెద్దపల్లిలో ఐటీఐ చదువుకున్నది. లైన్ఉమెన్ పోస్టుకు దరఖాస్తు చేసిన నాటి నుంచి పట్టుదలతో రాత్రింబవళ్లు శ్రమించింది. రాతపరీక్ష కోసం పుస్తకాలతో కుస్తీపడుతూనే శారీరక దారుఢ్య పరీక్షకు సిద్ధమైంది. పోల్స్, టవర్స్ ైక్లెంబింగ్లో మెళకువలు నేర్చుకున్నది. 3 నిమిషాల్లో విద్యుత్ టవర్ ఎక్కి దిగడంలో పోటీ నిర్వహించగా సుమలత కేవలం 2 నిమిషాల 36 సెకన్లలో పని పూర్తి చేసి సత్తా చాటింది. ఉద్యోగానికి ఎంపికైనా కోర్టుకేసు ఓ కొలిక్కిరాక మూడేండ్లు ఎదురు చూసింది. ఇటీవలే కోర్టు అనుమతి మేరకు ఈ నెల 13న ఉద్యోగ నియామక పత్రం అందుకున్నది. ఈ మేరకు సుమలత బుధవారం కరీంనగర్లోని సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పురుషులకు దీటుగా సేవలందిస్తానని ఆమె ధైర్యంగా చెప్పారు. కాగా, పలువురు ట్రాన్స్కో ఉద్యోగులు అభినందనలు తెలిపారు.
ఉద్యోగం రావడం ఆనందంగా ఉన్నది..
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం రావడం ఆనందంగా ఉన్నది. నిరుపేద కుటుంబానికి చెందిన తాను సర్కారు స్కూళ్లలో చదివిన. 2014-16 సంవత్సరంలో పెద్దపల్లి ఐటీఐలో ఎలక్ట్రీషియన్ పూర్తిచేసిన. 2017 ఫిబ్రవరి 13న జేఎల్ఎం పోస్ట్ కోసం పరీక్ష రాసిన. మా తల్లిదండ్రులు చంద్రయ్య- స్వరూప నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఫిజికల్ పరీక్షలో భాగంగా 220కేవీ టవర్, కరంట్ స్తంభం ఎక్కి ఉత్తీర్ణత సాధించిన. తెలంగాణ రాష్ట్రంలో కొలువు కొట్టడం ఆదృష్టంగా భావిస్తున్న.
దసరా కానుకగా నియామకాలు..
ఈ పోస్టుల కోసం ఐటీఐ ఎలక్ట్రీషియన్ పూర్తి చేసిన పలువురు మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. పట్టుదలతో ఇటు ఫిజికల్, రాత పరీక్షకు సన్నద్ధమయ్యారు. ఫిజికల్ టెస్ట్లో భాగంగా పోల్, టవర్ ైక్లెంబింగ్ను విజయవంతంగా పూర్తి చేశారు. అదే ఉత్సాహంతో పుస్తకాలతో కుస్తీపట్టి రాత పరీక్షలోనూ మెరిసి ఉద్యోగాలు దక్కించుకున్నారు. అయితే కోర్టు కేసు కారణంగా నియామక ప్రక్రియ ఆలస్యమైంది. నెల రోజుల క్రితం నియామకాలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తుది జాబితాను రూపొందించిన అధికారులు ఉమ్మడి జిల్లాలో 74 మందిని ఎంపిక చేశారు. ఇందులో 25 మంది మహిళలు ఉన్నారు. వీరికి ఈ నెల 13న దసరా కానుకగా నియామకపత్రాలు అందించారు. ఈ సందర్భంగా మహిళా లైన్మెన్లు హర్షం వ్యక్తం చేశారు. ఉత్సాహంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తామని చెప్పారు.