అన్నదాతలకు అండగా తెలంగాణ సర్కార్
కర్షకులకు వెన్నుదన్నుగా సీఎం కేసీఆర్
నాలుగేళ్లుగా సాగుకు ముందే పెట్టుబడి సాయం
ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
కొత్తగూడెం జూన్ 26: రైతులకు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి లభించింది. కర్షకుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్.. పంట పెట్టుబడి కోసం ‘రైతు బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. అదును కంటే ముందుగానే నేరుగా ఖాతాలో పెట్టుబడి సాయం సొమ్ము జమ అవుతుండడంతో అన్నదాతలు సంతోషంగా సాగులోకి దిగుతున్నారు. నాడు వలసబాట పట్టిన ఎంతోమంది రైతులు నేడు సాగు బాటపడుతున్నారు. అంతేకాదు, గతంతో పోలిస్తే బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకునే రైతుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నది. దళారుల ప్రమేయం లేకుండా సాగు సాయం అందుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
ఒకప్పుడు సీజన్ మొదలైందంటే చాలు.. రైతులంతా పెట్టుబడి కోసం అప్పులు ఇచ్చే వాళ్ల చుట్టూ తిరిగే వారు. పంట పండినా పండకపోయినా వడ్డీలు కట్టాల్సిన పరిస్థితులు ఉండేవి. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి, భూమిని తనఖా పెట్టి మీరు సాగు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడేవి. పంట పండకపోతే చివరికి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. కానీ, తెలంగాణ సర్కార్ ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి పెద్దపీట వేసింది. అన్నదాతలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. సీజన్ ప్రారంభమైన సమయంలో పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతులు గుండె మీద చేయి వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. దీంతో ఏటా భద్రాద్రి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది.
పెట్టుబడి ఇబ్బందులు లేవు..
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇవ్వని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు అమలు చేస్తున్నది. ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున నగదు అందజేస్తున్నది. దీంతో దేశం దృష్టి తెలంగాణ వైపు మళ్లింది. నాలుగేళ్లుగా ఏటా రెండు సీజన్లలో రైతులకు సొమ్ము అందుతున్నది. కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ సర్కారు అన్నదాతలకు అండగా నిలిచింది. ఎన్ని విపత్తులు వచ్చినా పెట్టుబడి సాయం మాత్రం ఆపలేదు.
సులభంగా బ్యాంకు రుణాలు..
ఉమ్మడి పాలనలో సాగు చేయాలంటే రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి. వారికి సకాలంలో బ్యాంకు రుణాలు ఇవ్వడంతో దర్జాగా పంటలు సాగు చేసుకుంటున్నారు. దీంతో ఊర్లలో వడ్డీలకు అప్పు ఇచ్చే సంస్కృతి మెల్లమెల్లగా వెళ్లిపోతున్నది. సీజన్కు ముందే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి అర్హులందరికీ రుణాలు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో సకాలంలో రుణాలు అందుతున్నాయి.
అంచనాలకు మించి సాగు విస్తీర్ణం
సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడడంతో ఈ ఏడాది వానకాలంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తుండడం, అదునులోనే రైతుబంధు సొమ్ము ఇస్తుండడంతో ఏటికేడు పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. మిషన్ కాకతీయతో చెరువులు పటిష్టం కావడం, భూగర్భజలాలు పెరగడం, 24 గంటలు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తుండడమూ అన్నదాతలకు కలిసి వస్తున్నది.
రైతుల కోసమే పథకాల అమలు..
రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తున్నది. రైతుబంధు పథకంతో లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతున్నది. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఇప్పటికే రూ.202 కోట్లు రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. పోడురైతులకూ సొమ్ము అందింది. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరిస్తున్నాం. రైతువేదికల్లో సమావేశాలు నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తున్నాం.
–కొర్సా అభిమన్యుడు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, కొత్తగూడెం
అప్పుల బాధలు తప్పాయి..
గతంలో చిన్న రైతులు చితికిపోయారు. అప్పటి ప్రభుత్వాలు రైతులను ఆదుకోలేదు. తెలంగాణ వచ్చాక రైతుల కష్టాలు తీరాయి. అప్పులు తెచ్చి సాగు చేసే కాలం పోయింది. ఆభరణాలు తాకట్టు పెట్టి అప్పు తీర్చే అవసరం లేకపోయింది. పంట పెట్టుబడికి ఎదురుచూసే అగత్యం లేదు. ప్రతి సీజన్లో సమాయానికి ప్రభుత్వం రైతుబంధు అందజేస్తున్నది.
-బాగం మోహన్రావు, రైతు, సుజాతనగర్, భద్రాద్రి జిల్లా