న్యూఢిల్లీ : వంట గ్యాస్ సిలిండర్ ధర రేపటి నుంచి తగ్గనున్నది. ఏప్రిల్ 1 నుంచి సిలిండర్పై రూ.10 తగ్గుతుంది. ఫిబ్రవరిలో వరుసగా ధరల పెరుగుదల ప్రభావంతో ఉన్న గృహిణులకు ఉపశమనం కలిగించేలా గ్యాస్ ధర తగ్గింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం సిలిండర్ ధరలో రూ.10 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పటికే వారంలో మూడుసార్లు తగ్గించినప్పటికీ, వంట గ్యాస్ ధర కూడా సమీప భవిష్యత్తులో తగ్గుతాయని అధికారి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ చమురు ధరలు పడిపోయినందున పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలన్నీ తగ్గుతాయని పేరు తెలుపడానికి ఇష్టపడని ఒక ఉన్నత అధికారి తెలిపారు. మంగళవారం ధరలను కొంత పెంచినప్పటికీ, మొత్తం ధోరణి క్షీణించిందని, ఇది దేశీయ రిటైల్ రేట్లలో ప్రతిబింబించాలని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్కు ఈ ఏడాది ప్రారంభం నుంచి మూడుసార్లు పెంపుదల తర్వాత ధర రూ.819 కు చేరుకున్నది. జనవరిలో ధర రూ.694 గా ఉండగా.. ఫిబ్రవరిలో రూ.719 కు పెరిగింది. ఫిబ్రవరి 15 న ధరను మళ్లీ రూ.769 కు, ఫిబ్రవరి 25 న మళ్లీ రూ.794 కు పెంచారు. మార్చిలో ఈ ధర రూ.819 కు చేరుకున్నది.
కోల్కతాలో సిలిండర్ ధర రూ.845 కాగా, ముంబై, చెన్నైలలో ధరలు వరుసగా రూ.819, రూ.835 గా ఉన్నాయి.