మొయినాబాద్, జూలై 16 : ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో మండలంలోని తోల్కట్ట్ట గ్రామం కొత్త సొబగులద్దుకున్నది. 99 శాతం ప్రగతి పనులను పూర్తి చేసి ఆదర్శంగా నిలిచింది. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం, వంద శాతం ఇంటి పన్ను వసూలుతో అభివృద్ధి పథంలో గ్రామం దూసుకెళ్లున్నది. సర్పంచ్ శ్రీనివాస్ పల్లె ప్రకతి వనం, మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గతంలో సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేయగా, ప్రస్తుతం అంతర్గత మురుగు కాల్వలను నిర్మిస్తున్నారు. 90 శాతం మరుగుదొడ్లను నిర్మించారు. గ్రామ పొలిమేర వరకు రోడ్డుకు ఇరువైపులా రెండు వరుసల్లో మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.
రూ.కోట్ల విలువ చేసే భూమిలో‘పల్లె ప్రకృతి వనం’
హైదరాబాద్-బీజపూర్ జాతీయ రహదారి సమీపంలో ఉన్న రూ.కోట్ల విలువ చేసే 2.20 ఎకరాల స్థలంలో పచ్చని తివాచీలా పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించారు. రకరకాల మొక్కలతో పాటు పండ్ల మొక్కలు కలిపి 4,500 మొక్కలను పెంచుతున్నారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి నుంచి గ్రామానికి ఉన్న రోడ్డుకు ఇరువైపులా రెండు వరుసల్లో మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనంలో వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్న వ్యవసాయ క్షేత్రం నుంచి నీళ్లు తెచ్చి మొక్కలకు పడుతున్నారు. త్వరలో బోరు వేసేందుకు సర్పంచ్ శ్రీనివాస్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు వాకింగ్ చేసిన తరువాత సేద తీరడానికి పల్లె ప్రకృతి వనంలో ప్రత్యేకంగా బల్లలను ఏర్పాటు చేశారు.
కబ్జా భూమి స్వాధీనం..
గ్రామ రెవెన్యూలోని సర్వే నెంబర్ 67 లోని ఎకరం భూమిని స్వాధీనం చేసుకున్నారు. అందులో డంపింగ్ యార్డు, నర్సరీని ఏర్పాటు చేశారు. మిగిలిన భూమిని ఎవరు స్వాధీనం చేసుకోకుండా 1000 మొక్కలు నాటారు.
ఊరికి 2 కి.మీ దూరంలో వైకుంఠధామం..
గ్రామానికి 2 కిలో మీటర్ల దూరంలో సుమారు 3 ఎకరాల్లో వైకుంఠధామాన్ని నిర్మించారు. గ్రామస్తులంతా ఇక్కడే దహనసంస్కారాలు చేయాలని పంచాయతీ పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేకంగా మరుగుదొడ్లు, స్నానాల గదులను నిర్మించారు. నీటి కొరత లేకుండా బోరును సైతం వేయించారు.
రూ.కోటితో మోడల్ పాఠశాల నిర్మాణం
తోల్కట్ట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎన్ఆర్ఐ భాస్కర్రావు స్థాపించిన శశిరావు ఫౌండేషన్ దత్తత తీసుకున్నది. ఇంగ్లిష్ మీడియం బోధించేందుకు కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోట్ల విలువ చేసే రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. మోడల్ పాఠశాల నిర్మాణానికి ఆ సంస్థ ప్రతినిధులు సంకల్పించారు. భవన నిర్మాణానికి జనవరి 7వ తేదీన చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు.
పల్లె ప్రకృతి వనం గ్రామానికి ఓ మణిహారం..
పల్లె ప్రకృతి వనం నిర్మాణం గ్రామానికి ఓ మణిహారంగా మారింది. పల్లె ప్రగతిలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నాం. ఇంగ్లిష్ మీడియం విద్యా బోధనకు శశిరావు ఫౌండేషన్ ముందుకొచ్చింది. రూ.కోటి నిధులతో మోడల్ పాఠశాలను నిర్మించనున్నారు. సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాల్వలను నిర్మించాం.