డెహ్రాడూన్ : రిసార్ట్ రిసెప్షనిస్ట్ అంకిత బండారి హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అంకితను బీజేపీ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వినోద్ ఆర్యతో పాటు ఆయన కుమారుడు అంకిత్ ఆర్యను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటన విడుదల చేసింది. అంకిత హత్య కేసులో పుల్కిత్ ఆర్యతో పాటు రిసార్ట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు చేసిన నేరాన్ని అంగీకరించారు.
వ్యక్తిగత వివాదాల కారణంగానే రిసార్ట్కు సమీపంలోని పవర్ హౌజ్ డ్యాంలో అంకితను తోసేశామని చెప్పారు. అనంతరం ఆమె చనిపోయిందని నిందితులు ఒప్పుకున్నారు. ఇక ఇవాళ ఉదయం రిసార్ట్ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. రిసార్ట్కు నిప్పు పెట్టి, బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంకిత హత్యకు గురైన నేపథ్యంలో రెండు రోజుల క్రితం వినోద్ ఆర్య ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ హత్య కేసులో తన కుమారుడు పుల్కిత్ ఆర్య ప్రమేయం ఉన్నట్లు తేలితే, తమపై చర్యలు తీసుకోవచ్చని ప్రకటించారు.