హడావుడిగా విచారణ ముగించడం సరికాదు
ప్రాజెక్టుల పరిహారం కేసును పునర్విచారించాలి
తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా హడావుడిగా విచారణ ముగించడాన్ని అంగీకరించజాలమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాళేశ్వరం, కొండపోచమ్మసాగర్, అనంతగిరి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారానికి సంబంధించి.. పెండ్లి కాని మేజర్ యువతకు విడిగా పరిహారం చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని మంగళవారం జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ కృష్ణమురారితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలను పక్కన పెడుతున్నట్టు ధర్మాసనం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని వైద్యనాథన్ తెలిపారు. పరిహారంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు పునర్విచారణ చేయాలని ధర్మాసనం సూచించింది. తెలంగాణ హైకోర్టు సీఎస్ ఈ పిటిషన్లను విచారించి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది.