మర్పల్లి, జూలై 16 : ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో రావులపల్లి గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ఎన్నో ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారమయ్యాయి. పంచాయతీ పాలక వర్గం, అధికారులు, గ్రామస్తుల సమష్టి కృషితో గ్రామ రూపురేఖలు మారాయి. గ్రామానికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా పచ్చని మొక్కలు దర్శనిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనంలో విరివిగా మొక్కలు నాటడంతో అవి పెరిగి పెద్దవై కనువిందు చేస్తున్నాయి. వివిధ రకాల మొక్కలతో పాటు మంకీ ప్రూట్ మొక్కలను పెంచుతుండడంతో ఆహ్లాదకర వాతావరణం చోటుచేసుకున్నది. ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లాలను వేసి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడుగుంతలను నిర్మించారు. నిత్యం గ్రామపంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. ప్రతి వీధిలో మురుగు కాల్వలను నిర్మించడంతో పాటు నిత్యం చెత్త లేకుండా వీధులను శుభ్రం చేస్తున్నారు. గ్రామంలో నిర్మించిన డంపింగ్యార్డు, వైకుంఠధామాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించడంలో ముందు వరుసలో ఉన్న గ్రామంగా నిలిచింది. పచ్చదనం, పరిశుభ్రతలో ఉత్తమ పంచాయతీగా ఎంపిక కాగా, రాష్ట్ర మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే అవార్డును సైతం అందజేశారు. గ్రామంలో 485 ఇండ్లు ఉండగా, జనాభా 1963 మంది ఉన్నారు.
10 ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనం
గ్రామ సమీపంలోని గుట్టపై పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించారు. పూలు, పండ్ల మొక్కలతో పాటు మంకీప్రూట్ మొక్కలు నాటగా, ఏపుగా పెరిగి ఆహ్ల్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి. ప్రకృతి వనం దగ్గర సిలువ, కొద్ది దూరంలో ఈద్గా, రోడ్డుకు అవతలిపైపు పీతాంబరేశ్వర స్వామి ఆలయం, 10 ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నారు. 2 వందల మీటర్ల దూరంలో చెరువు చుట్టూ ఉన్న గుట్టలపై ఏపుగా పెరిగిన చెట్లు కనువిందు చేస్తున్నాయి..
రూ.39 లక్షలకుపైగా ఖర్చుతో అభివృద్ధి పనులు..
గ్రామంలో రూ. 6.92 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.2.50 లక్షలతో కంపోస్టు షెడ్డు, రూ.11.94 లక్షలతో వైకుంఠధామం, రూ.50 వేలతో డంపింగ్ యార్డు, రూ.8 లక్షలతో మురుగు కాల్వలను నిర్మించారు. రూ.9.53 లక్షలతో ట్రాక్టర్, ట్య్రాలీ, వాటర్ ట్యాంకర్ కొనుగోలు చేశారు.
సమష్టి కృషితోనే అభివృద్ధి..
గ్రామస్తులు, అధికారులు, పాలకవర్గం సమష్టి కృషితో పల్లె ప్రగతి అభివృద్ధి పనులను సకాలంలోనే పూర్తి చేశాం. పరిసరాల పరిశుభ్రతలో గ్రామస్తులకు అవగాహన కల్పించాం. ప్రతి వీధి పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ సిబ్బంది పని చేస్తున్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే సందర్శనలో భాగంగా గ్రామంలో కలియతిరిగి, పల్లె ప్రగతి పనులు, పల్లె ప్రకృతి వనంలో ఏపుగా పెరిగిన మొక్కలను చూసి అభినందించారు.
-నల్ల దేవమ్మ అబ్రహం, సర్పంచ్ రావులపల్లి
అధికారుల సూచనలు పాటిస్తున్నాం..
‘పల్లె ప్రగతి’ పనుల్లో అధికారుల సూచనలు పాటించి, ఎన్నో ఏండ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నాం. పల్లె ప్రకృతి వనం, కంపోస్టుషెడ్డు, వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేశాం. ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ కొనుగోలు చేశాం. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి, సేంద్రియ ఎరువును తయారు చేసి నర్సరీలోని మొక్కలకు వాడుతున్నాం. పల్లె ప్రకృతి వనం చాలా అద్భుతంగా ఉన్నది.
-స్వప్న, రావులపల్లి పంచాయతీ కార్యదర్శి