ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్ జంటగా నటిస్తున్న సినిమా ‘తీస్ మార్ ఖాన్’. సునీల్, పూర్ణ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు.
హీరోలు సుధీర్ బాబు, అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ అతిథులుగా పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ..‘చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాలో నటించాను. భావోద్వేగాలున్న మంచి స్క్రిప్ట్ ఇది. సునీల్ చేసిన చక్రి అనే పాత్ర బాగుంటుంది. దర్శకుడు నన్ను కొత్తగా తెరపై చూపించబోతున్నాడు’ అన్నారు.
నాయిక పాయల్ రాజ్పుత్ మాట్లాడుతూ..‘నేను స్టార్ కిడ్ను కాదు ఇండస్ట్రీలో నాకు నేనుగా పేరు తెచ్చుకున్నాను. ఈ సినిమా ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్. కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి’ అని చెప్పింది. దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ..‘కథను నమ్మి సాంకేతిక నిపుణులు కష్టపడ్డారు. ఆది పాత్ర ఆశ్చర్యపరిస్తే సునీల్, పూర్ణ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకునేలా ఉంటాయి’ అన్నారు.