‘పూజకొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు’ అని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఆ సామెతకు మరో కొసమెరుపు చేర్చి ‘పూర్వజన్మ సుకృతం కొద్దీ మిత్రులు చేకూరుతారు’ అని వాళ్ల ముగ్గుర్నీ చూసినవాళ్లు అంటుంటారు.
“ఎవరయ్యా ఆ ముగ్గురు?” అని అడిగితే..
“మొదటివాడు సత్యం, రెండవవాడు శివం, మూడోవాడు సుందరం..” అని కూడా చెప్పేస్తారు.
ఆ మూడు పేర్లూ వాళ్ల నామకరణం నాడు తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కాదు, అవి వేరే ఉన్నాయి. సత్యం అసలు పేరు సత్యమూర్తి. శివం అసలు పేరు శివరావు. ఇక సుందరం అసలు పేరు సుందరరావు. వాళ్ల ముగ్గురి స్వస్థలం హైదరాబాదే! ఆరో తరగతిలోకి వచ్చేవరకూ వాళ్లను ఆ పేర్లతోనే పిలుచుకునేవారు కూడా! అయితే వాళ్లు ఆరో తరగతిలో చేరినప్పుడు ‘అటెండెన్స్ మార్క్’ చేసే క్లాసు టీచర్, వాళ్ల పేర్లు చదువుతూ..
“మీ పేర్లు చాలా బాగున్నాయర్రా.. కానీ, నేను మాత్రం మిమ్మల్ని ‘సత్యం, శివం, సుందరం’ అని పిలుస్తాను. మీ ముగ్గుర్ని ఒకే బెంచీమీద కూర్చోపెడతాను. వెరైటీగా ఉంటుంది” అన్నారు.
అప్పట్నుంచీ ఆ పేర్లతోనే పిలువబడుతూ, ఒక బెంచీమీదనే కూర్చుంటూ పదో క్లాసుదాకా చదివి పాసయ్యారు. తర్వాత కూడా ఒకే జూనియర్ కాలేజీలో చేరి ఇంటర్ చదివారు. ఆ రోజుల్లోనే ఓ సంఘటన జరిగింది. ముగ్గురూ కలిసి ఓ ఆదివారం సాయంత్రం గండిపేట చెరువులో స్నానం చేద్దామని వెళ్లారు. నీళ్లలో సత్యం ఓ అడుగు ముందుకు వేసి, అక్కడ కాలు నేలకు అందక ప్రవాహంలో మునిగిపోయాడు. దాంతో భయపడి, రెండు చేతులూ పైకెత్తి..
“హెల్ప్ మీ.. హెల్ప్ మీ..” అంటూ కేకలు పెట్టాడు.
అప్పుడు సుందరం ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా అతనివైపు ఉరికి ఓ చేయి పట్టుకొని ఒడ్డుకు లాక్కొని వచ్చాడు. గట్టుమీద అతన్ని వెళ్లకిలా పడుకోబెట్టి, పీకలదాకా మింగిన నీళ్లను బయటకు కక్కించి ప్రాణాలు నిలబెట్టాడు. అదే జరిగి ఉండకపోతే ఆ ముగ్గురు మిత్రుల్లో ఇద్దరే మిగిలి ఉండేవారు. అప్పట్నుంచీ సత్యానికి సుందరం పట్ల గౌరవంతోపాటు ప్రేమాభిమానాలు కూడా ఎక్కువయ్యాయి. అప్పటినుంచీ సుందరాన్ని చూసినప్పుడల్లా ‘ప్రాణదాతకు ప్రణామాలు’ అంటుండేవాడు సత్యం. ‘అలా అనవద్దు’ అని సుందరం వారించేవాడు.
ఇంటర్ పూర్తయ్యాక ముగ్గురూ కాలేజీలు మారిపోయారు. సత్యం డిగ్రీ కాలేజీలో చేరితే, శివం మెడికల్ కాలేజీలో చేరాడు. ఇక సుందరం ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. కానీ, స్నేహితులుగా మాత్రం వాళ్లు విడిపోలేదు. ముగ్గురూ ఒకే కాలనీలో ఉండేవాళ్లు. కనుక, రోజూ కలుస్తూనే ఉండేవారు. సినిమాలకు, షికార్లకూ కలిసే వెళ్తుండేవాళ్లు. ఎవరైనా తెలిసినవాళ్లు ఈ ముగ్గుర్నీ ఒకేచోట చూసినప్పుడు..
“మీ చదువులు వేరైనా మీరు మాత్రం వేరువేరుగా కనిపించరేమిటయ్యా?” అని ప్రశ్నిస్తే, దానికి ముగ్గురూ ఒకే సమాధానం చెప్పేవారు..
“మన జీవితంలోని ప్రతి దశలోనూ స్నేహితులనేవాళ్లు దొరుకుతూనే ఉంటారండీ! కానీ, జీవితాంతం కలిసి ఉండే స్నేహితులే నిజమైన స్నేహితులండీ.. ఆ స్నేహమే మా మధ్య ఉంది!” అని.
ఆ స్నేహపూరిత వాతావరణంలో వాళ్లమధ్య రోజులు, వారాలు, నెలలూ, ఏళ్లుగా మారిపోతున్నాయి. అలా మారిపోయిన పదేండ్ల వ్యవధిలో వాళ్ల జీవితాల్లో అనేక సంఘటనలు జరిగాయి. సత్యం పబ్లిక్ సర్వీస్ పరీక్ష రాసి సెక్రటేరియట్లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. మెడిసిన్ చదివిన శివం, హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్గా చేరిపోయాడు. ఇంజినీరింగ్ పట్టా తీసుకున్న సుందరం మాత్రం ఢిల్లీలోని ఓ ‘ఐటీ కంపెనీ’లో ఉద్యోగంలో చేరాడు.
ముగ్గురికీ అటూఇటుగా నాలుగేండ్ల వ్యవధిలో పెండ్లిళ్లుకూడా జరిగిపోయాయి. పెండ్లయిన రెండేండ్లకే సత్యం దంపతులకు ఒక మగపిల్లాడు కలిగాడు. ఆరేడేండ్లయినా శివానికీ, సుందరానికీ ‘తండ్రి’ హోదా లభించలేదు. సత్యం, శివం హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్లో పక్కపక్కనే చెరో ఫ్లాట్ కొనుక్కొని, ఒకేసారి గృహప్రవేశం చేసుకున్నారు. ఆ వేడుక చూసేందుకు ఢిల్లీ నుంచి సుందరం వచ్చాడు.
“నేను కూడా హైదరాబాద్ వచ్చేసి, ఇక్కడే వేరే ‘జాబ్’ చూసుకుంటానర్రా.. మీ ఫ్లాట్స్ పక్కనే మరొకటి ఖాళీగా ఉంటే చూడండి. అప్పుడు మనం ముగ్గురం ముచ్చటగా ఒకేచోట ఉండొచ్చు!” అన్నాడు సుందరం.
“నువ్వు రావాలే గానీ, మాకు అంతకంటేనా..” అన్నాడు సత్యం.
“అలా మాట వరుసకు అంటున్నాడే కానీ, అంతమంచి జాబ్ ఈ హైదరాబాద్లో ఇప్పటికిప్పుడు దొరకొద్దూ..?” అలా అంటే అయినా పౌరుషం వచ్చి సుందరం ఆ ప్రయత్నంలో పడతాడనుకున్నాడు శివం.
మొత్తానికి ఢిల్లీనుంచి వచ్చిన సుందరం మాత్రం సత్యం కొడుకుతో అక్కడున్న మూడు రోజులూ కాలక్షేపం చేసి మురిసిపోయాడు. వాణ్ని ఎత్తుకొని టాక్సీ ఎక్కించి ఊరంతా తిప్పాడు. వాడికి కొత్త డ్రెస్సులూ, రకరకాల బొమ్మలూ కొనిచ్చాడు.
“ఎందుకన్నయ్యా ఇంత డబ్బు ఖర్చు చేసి అవన్నీ కొనడం?” అని అడిగింది లలిత.
“నీకు తెలీదమ్మా! సత్యం నాకు స్నేహితుడే కాదు. తమ్ముడిలాంటివాడు. అప్పుడు నువ్వు వరుసకి మరదలు అవుతావ్. అయినా నిన్ను మాత్రం ‘చెల్లెమ్మా’ అని పిలుస్తున్నాను. అలాంటప్పుడు మీ బాబీగాణ్ని నేను పరాయివానిగా ఎలా చూసుకుంటానమ్మా.. అయినా వాడికోసం నేను చేసింది కూడా ఓ ఖర్చేనా..” అన్నాడు సుందరం.
నాలుగో రోజున అతను తిరిగి ఢిల్లీ తిరుగు ప్రయాణం అయినప్పుడు వీడ్కోలు చెప్పేందుకు అందరూ ఎయిర్ పోర్టుకి వెళ్లారు. అప్పుడు కూడా టాక్సీలో బాబీని, సుందరం తన పక్కనే కూర్చో పెట్టుకున్నాడు.
“అంకుల్! నువ్వూ, శివం బాబాయ్ మా నాన్నకు మంచి స్నేహితులట కదా..?” సుందరాన్ని అడిగాబు బాబి.
“మేం ముగ్గురం మంచి స్నేహితులం మాత్రమే కాదురా! ప్రాణస్నేహితులం. నీకు తెలుసో లేదో ఓసారి మేం ముగ్గురం చెరువులో స్నానానికి వెళ్లినప్పుడు నేను ఈత కొడుతూ, ఆ నీళ్ల ప్రవాహంలో మునిగిపోతే అప్పుడు ఈ సుందరం అంకులే నన్ను బయటకు లాగి ప్రాణాలు కాపాడాడు!” చెప్పాడు సత్యం.
“ఓఁ! గ్రేట్. అయితే సుందరం అంకుల్ హీరో అన్నమాట!” చప్పట్లు కొడుతూ అన్నాడు బాబి.
“మామూలు హీరో కాదురా! సూపర్ హీరో” పక్కనే కూర్చున్న శివం చెప్పాడు.
టాక్సీ ఎయిర్పోర్టుకి చేరుకోగానే తన సూట్కేసు తీసుకొని కిందకు దిగాడు సుందరం.
“ఉంటాను రా! అప్పుడప్పుడూ మీ బాబీగాడితో ఫోన్లో మాట్లాడిస్తూ ఉండూ” అని సత్యానికి చెప్పి, లోపలకు వెళ్లి పోయాడు.
ఇక శివం సంగతి సరేసరి! పక్కపక్క ఫ్లాట్లలోనే ఉంటున్నారు కనుక సత్యం దంపతులతో అతని స్నేహం మరింత బలపడింది. బాబీతో చనువుకూడా ఎక్కువైంది. ప్రతిరోజూ హాస్పిటల్కి వెళ్లేటప్పుడు ఓసారి వాడి బుగ్గగిల్లి ముద్దు పెట్టుకొని ‘బై’ చెప్పేవాడు. మళ్లీ సాయంత్రం హాస్పిటల్ నుంచి తిరిగి రాగానే ‘హాయ్ బాబీ’ అంటూ పలుకరించేవాడు. బట్టలు మార్చుకొని వచ్చి, తన దగ్గరే కూర్చోబెట్టుకునేవాడు. రోజూ వాడు చేసే చిలిపి పనులగురించి సుందరానికి ఫోన్లో చెప్తూ ఉండేవాడు. వాడితో తీసుకున్న సెల్ఫీలూ, ఫొటోలు వాట్సప్లో నిత్యం అతనికి పంపుతూ ఉండేవాడు.
రోజులు అలా గడుస్తుండగా, ఓసారి బాబీకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. సత్యం కంటే శివం ఎక్కువ ఖంగారు పడిపోయాడు. వెంటనే తాను పనిచేస్తున్న హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేశాడు. చిల్డ్రన్ స్పెషలిస్టులతో వైద్యం చేయించాడు. తనూ, తన భార్య కలిసి ఆ పది రోజులూ హాస్పిటల్లోనే సత్యం దంపతులకు సాయంగా ఉండి సపర్యలు చేశారు. ఆ విషయాన్ని ఢిల్లీలో ఉన్న సుందరానికి ఫోన్లో చెప్పేసరికి అతనుకూడా ఖంగారు పడిపోయాడు. రోజుకు రెండుసార్లయినా శివానికి ఫోన్ చేసి, వాడి ఆరోగ్యం గురించి వాకబు
చేసేవాడు.
“త్వరగా బాబీకి జ్వరం తగ్గిపోయి, క్షేమంగా ఇంటికి చేరిపోతే ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కణ్నుంచి తిరుపతి వెళ్లి ఆ స్వామికి తలనీలాలు సమర్పించుకుంటా” అని మొక్కుకున్నాడు. మాటల సందర్భంలో ఆ సంగతి సత్యానికి చెప్పినప్పుడు, అతని కండ్లు
చెమర్చాయి.
“చూశావా లలితా! మనం అంటే శివానికీ, సుందరానికీ ఎంత ప్రేమో! పాపం.. వాళ్లిద్దరికీ పెండ్లిళ్లయి ఇంతకాలమైనా పిల్లలు కలుగలేదు. ఆ ఏడుకొండల వెంకన్న దయవల్ల రేపోమాపో వాళ్లకు కూడా పిల్లలు కలగాలోయ్. అప్పుడు మనం కూడా తిరుపతి వెళ్లి ఆ స్వామిని దర్శించుకుందాం. నేనైతే నా తలనీలాలు సమర్పించుకుంటాను” అన్నాడు సత్యం.
“స్నేహం అంటే మీదేనండీ!” అంది లలిత అతనివైపు మెచ్చుకోలుగా చూస్తూ..
“లలితా.. ఏం చేస్తున్నావ్. నీకో శుభవార్త చెప్పబోతున్నాను. త్వరగా రావాలి” ఆఫీసునుంచి అప్పుడే ఇంటికొచ్చి.. హాల్లోకి అడుగుపెట్టిన సత్యం పిలిచాడు.
“వస్తున్నానండీ..” వంటింట్లోంచి బదులిచ్చింది లలిత.
“ఏమిటి డాడీ ఆ శుభవార్త? నీకు ఆఫీసులో ప్రమోషన్ వచ్చిందా..?” అక్కడే సోఫాలో కూర్చుని సెల్ఫోన్లో ‘గేమ్’ ఆడుతున్న బాబి అడిగాడు.
“అంతకంటే మంచి వార్తరా!”
“ఏమిటండీ ఆ వార్త?” వంటింట్లోంచి వస్తూ అడిగింది లలిత.
“రేపు నేను మా సుందరం గాణ్ని కలుసుకోబోతున్నానోయ్” సంతోషంతో చెప్పాడు సత్యం.
“అలాగా! ఇక్కడికి వస్తున్నట్టు అన్నయ్య ఫోన్ చేశాడా..?”
“లేదోయ్! వాడు ఇక్కడకు రావడం కాదు. నేనే ఢిల్లీ వెళ్తున్నాను. రేపూ ఎల్లుండీ శని, ఆదివారాలు కదా.. హాయిగా వాడితో గడిపేస్తాను. మా ఆఫీసునుంచి కొన్ని ముఖ్యమైన ఫైళ్లు అక్కడి సెక్రటేరియట్లో నన్ను పర్సనల్గా ఇచ్చి రమ్మన్నారు. సోమవారం ఆ పని పూర్తి చేసుకొని మళ్లీ మంగళవారం బయల్దేరి వచ్చేస్తాన్లే! ఫ్లయిట్ టిక్కెట్లు ఆఫీసువాళ్లే అరేంజ్ చేశారు”
“మేం కూడా వస్తామండీ” పక్కనే కూర్చొని అడిగిందామె.
“మీరా..?”
“అవునండీ.. మన పెండ్లి అయ్యాక హనీమూన్ తీసుకెళ్తానని చెప్పారు గుర్తుందా..? ఇదిగో వెళ్దాం.. అదిగో వెళ్దాం.. అంటూ పదేండ్ల నుంచీ వాయిదాలమీద వాయిదాలు వేసేశారు. మనకు బాబిగాడు కూడా పుట్టేసి ఎనిమిదేండ్లు అయిపోయింది. ఇప్పుడైనా తీసుకెళ్లండీ! పైగా నేను ఎప్పుడూ విమానం ఎక్కలేదు కూడానూ..” గారాలు పోతూ చెప్పింది.
“ఇప్పటికిప్పుడు అడిగితే ఎలాగోయ్? టికెట్స్ దొరకొద్దూ?”
“మీ స్నేహం పవిత్రమైందే అయితే తప్పకుండా దొరుకుతాయి. నెట్లో చూడండి”
“ఔను డాడీ! తప్పకుండా దొరుకుతాయి. నేను దేవుడికి దండం పెట్టుకుంటాను. నాక్కూడా సుందరం అంకుల్ని చూడాలని ఉంది. చూడు డాడీ” అంటూ దగ్గరకొచ్చి కంప్యూటర్ ఓపెన్ చేసి అడిగాడు బాబి.
“తప్పదా?” అంటూ నెట్ ఓపెన్ చేసి చూశాడు సత్యం.
ఫ్లయిట్లో చాలా ఖాళీలే ఉన్నట్లు
గమనించాడు.
“ఓఁ! చాలా ఖాళీలున్నాయి. శివంగాణ్ని కూడా అడిగితే బాగుంటుందేమో.. వాడుకూడా వస్తాడు”
“అడగండి!” సెల్ఫోన్ అందిస్తూ చెప్పింది లలిత.
“ఏమిటి చెల్లెమ్మా.. అడగమంటున్నావ్! ఎవర్నీ?” అప్పుడే ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన శివం అడిగాడు. అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ..
“నిన్నేరా.. సమయానికి వచ్చావ్! నేను ఫ్యామిలీతో రేప్పొద్దున ఫ్లయిట్లో ఢిల్లీ వెళ్తున్నాను. నువ్వూ, మీ ఆవిడా కూడా వస్తే బాగుంటుందనుకున్నాం. నాలుగు రోజుల్లో వచ్చేద్దాం. అఫ్కోర్స్! అక్కడ సెక్రటేరియట్లో నేను ఓ రోజు పని చూసుకోవాలనుకో.. మిగతా మూడు రోజులూ సుందరంతో కలిసి గడిపేయొచ్చు” హుషారుగా చెప్పాడు సత్యం.
“సారీరా.. నేను రాలేను..”
“అదేమిట్రా.. స్పృహలో ఉండే ఆ మాట చెప్పావా..?” అడిగాడు సత్యం.
“స్పృహలో లేకపోయినా బాగుండేది!”
“అంటే.. ఏమిటి నీ ఉద్దేశ్యం?”
“నువ్వు కూడా సుందరం ఇంటికి వెళ్లేందుకు వీల్లేదు” అంటూ సోఫాలోంచి చివాల్న లేచాడు.
“జోకులెయ్యకు! నువ్వు రావాల్సిందే. అస్తమానూ మనం సుందరాన్ని వీడియో కాల్స్లో చూసుకోవడమే తప్ప పర్సనల్గా కలువలేకపోయాం. ఎప్పుడో ఏడాది క్రితం మన ఇండ్ల గృహప్రవేశానికి వచ్చాడు”
శివం మాట్లాడలేదు. అతని కండ్లు చెమ్మగిల్లుతున్నాయని గ్రహించాడు సత్యం.
“ఏమైందిరా? మీ మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా?” అడిగాడు మళ్లీ.
“ఆఁ! అవును. అలాంటివే. నువ్వు వాడి ఇంటికి వెళ్తే మనమధ్య కూడా వస్తాయి!”
ఈసారి సత్యం కండ్లు చెమ్మగిల్లాయి.
“ఏమైందిరా! వాడితో మనస్పర్ధలా? పైగా నన్ను కూడా కలవద్దంటావా..? ఎందుకిలా మాట్లాడుతున్నావ్?”
“ఎందుకో నువ్వు తిరిగి వచ్చాక చెప్తాను. నువ్వు మాత్రం ఈ ట్రిప్పులో వాణ్ణి కలవడానికి వీల్లేదు. కలిశావంటే.. నామీద ఒట్టే!” గబగబా బయటకు నడిచాడు శివం.
నిశ్చేష్టుడై అటే చూస్తూ తలపట్టుకున్నాడు సత్యం.
మర్నాడు పొద్దున్నే కుటుంబంతో కలిసి ఎయిర్పోర్టుకి వెళ్లాడు సత్యం. విమానం ఎక్కి మధ్యాహ్నం రెండయ్యేసరికి ఢిల్లీకి చేరుకొన్నారు. ఆ రోజంతా రెస్టు తీసుకొని తర్వాత రెండు రోజుల్లో అక్కడ చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసేశారు. సోమవారం ఆఫీసు పని పూర్తి చేసుకొని హోటల్ రూమ్కి వచ్చాడు సత్యం.
“పని అయిపోయిందిగా.. ఇంక సుందరం అంకుల్ ఇంటికి వెళ్దాం డాడీ!” అడిగాడు బాబి.
“ఇప్పుడు వెళ్లడం కష్టం రా! వాడిల్లు ఇక్కడికి చాలాదూరం”
“అయితే మాత్రం టాక్సీలో వెళ్లొచ్చు కదా..”
“ఇప్పుడు ఓపిక లేదు నాన్నా” చెప్పాడు సత్యం.
“అదేం కాదులే. నాకు తెలుసు. అక్కడకు వెళ్ల వద్దని శివం అంకుల్ చెప్పాడుగా! నేను విన్నాను..”
“మరింకేం.. అందుకే వాళ్లింటికి వెళ్లదల్చుకోలేదు. పైగా తనపైన ఒట్టుకూడా వేసుకున్నాడు!”
“అయితే ఏం? ఒట్టు తీసి గట్టున పెట్టవచ్చట డాడీ. ఓసారెప్పుడో మమ్మీ చెప్పింది”
“గట్టున పెట్టే ఒట్టు కాదురా మాది. కట్టుబడి ఉండే ఒట్టు!” చెప్పాడు సత్యం.
“అయితే ఓసారి అంకుల్కి ఫోన్ చేసివ్వు. నేను మాట్లాడుతాను. ఢిల్లీ వచ్చామని చెప్తాను. అప్పుడు తనే మనల్ని చూడటానికి వస్తాడు” సలహా ఇచ్చాడు బాబి.
ఈ సలహా సత్యానికి నచ్చింది. వెంటనే ఫోన్ తీసి సుందరం నంబర్కి కాల్ చేశాడు. ‘స్విచ్ ఆఫ్’ అని వచ్చింది.
ఆ మాటే బాబికి చెప్పి, “ఇంక వదిలెయ్” అన్నాడు.
మర్నాడు ముగ్గురూ కలిసి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. విమానంలో కూర్చున్నాడన్న మాటేగానీ, సుందరాన్ని కలుసుకోలేదన్న బాధతో సత్యం మనసంతా అల్లకల్లోలమైపోయింది. అసలు సుందరాన్ని శివం ఎందుకు కలుసుకోవద్దన్నాడో..? ఇద్దరి మధ్యా మనస్పర్ధలు ఎందుకొచ్చాయో..? ఒకవేళ వచ్చాయే అనుకున్నా.. తనను కలవద్దనడానికి కారణం ఏమిటో..? ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు.
ఆ కలవరపాటుతోనే హైదరాబాద్ చేరుకొని ఇంటికి వచ్చాడు సత్యం.
రాగానే వాళ్లను చూసిన శివం.. “వచ్చేశారా” అంటూ ఆనందంతో బాబిగాణ్ని దగ్గరకు తీసుకున్నాడు.
“ఇదేమిట్రా? ఈ నాలుగు రోజుల్లోనే వీడు ఇంతగా చిక్కిపోయాడు..” అడిగాడు సత్యాన్ని.
“చిక్కిపోలేదు. సుందరాన్ని చూడలేక పోయినందుకు బెంగ పెట్టుకున్నాడు” ముఖం పక్కకు తిప్పుకొని చెప్పాడు సత్యం.
“సారీరా.. నన్ను క్షమించు. నా మాట విని వాడి దగ్గరకు వెళ్లలేదు!”
“అదే! వాడి దగ్గరకు ఎందుకు వెళ్లవద్దన్నావో ఇప్పుడైనా చెప్పు. వచ్చాక చెప్తానన్నావ్గా! మీ మధ్య మనస్పర్ధలు ఎందుకు వచ్చాయ్?” అడిగాడు సత్యం.
“మనస్పర్ధలు కాదురా.. వాడికి.. అదే సుందరానికి కరోనా వైరస్ సోకిందిరా.. ఆసుపత్రిలో ఉన్నాడు!” కంటతడితో చెప్పాడు శివం.
అంతే..
నోట మాట రాలేదు సత్యానికి. అక్కడే ఉన్న సోఫాలో కూలబడి పోయాడు.
‘అయ్యో..’ అంటూ లలితకూడా అతని పక్కనే కూర్చుండిపోయింది.
“ఎ.ప్పు.డు.” నెమ్మదిగా అక్షరాల్ని కూడదీసుకుంటూ అడిగాడు సత్యం. దిగులుగా చూస్తూ..
“అప్పుడే పది రోజులైందిరా.. మీ ఢిల్లీ ప్రయాణానికి ముందు యథాలాపంగా వాడికి ఫోన్ చేశాను. వాడు ఎత్తలేదు. చెల్లెమ్మ ఫోన్ తీసింది. ‘ఆయనకు కరోనా సోకింది అన్నయ్య గారూ! ఆసుపత్రిలో చేర్పించాను. నాలుగు రోజులైంది. అసలు తనకు కరోనా వచ్చిన విషయం ఎవరికీ చెప్పవద్దన్నాడు. ముఖ్యంగా మీకు చెప్పి, మిమ్మల్ని బాధ పెట్టడం ఆయనకు ఇష్టం లేదు’ అని చెప్పింది. నేను షాక్ అయ్యాను” తన బాధను హృదయంలో దాచుకుంటూ చెప్పాడు శివం.
“అయితే మనం అర్జంటుగా చెల్లెమ్మతో మాట్లాడాలిరా.. ఓసారి వీడియో కాల్ చేసి వాణ్ని చూపించమందాం..” అన్నాడు సత్యం.
“సాయంత్రం ఐదింటికి విజిటింగ్ అవర్స్ ఉంటాయి. అప్పుడు చెల్లెమ్మ ఆసుపత్రిలో ఉంటుంది” చెప్పాడు శివం.
ఆ రోజంతా ‘సాయంత్రం ఎప్పుడవుతుందా?’ అని ఎదురు చూస్తూ గడిపేశారు. పది నిమిషాల ముందే సుందరం భార్యకు వాట్సప్ద్వారా వీడియో కాల్ చేశాడు శివం. ఆమె ఫోన్ ఎత్తింది.
“హలో..!”
“ఏమిటి చెల్లెమ్మా ఈ దారుణం? సుందరానికి కరోనా సోకిందనీ, వాణ్ణి ఆసుపత్రిలో చేర్పించారని శివం చెప్పాడమ్మా.. ఇప్పుడు ఎలా ఉన్నాడు?” ఆందోళన నిండిన స్వరంతో అడిగాడు సత్యం.
“ఎలా ఉన్నారంటే ఏం చెప్పమంటావ్ అన్నయ్యా.. ఆ భగవంతుణ్నే అడగాలి!” దుఃఖాన్ని ఆపుకొంటూ చెప్పిందామె.
“ఏమిటమ్మా నువ్వు అంటున్నదీ?”
కంగారుగా అడిగాడు.
“ఆయన.. ఆయన.. వెళ్లిపోయారు అన్నయ్యా.. నాలుగు రోజుల్నుంచీ అసలు స్పృహలోనే లేరు. ఐ.సి.యులో ఉంచి వెంటిలేటర్ద్వారా ఆక్సిజన్ అందించారు. ఇవాళ పొద్దున్నే ఊపిరి ఆగిపోయింది. అంతా అయిపోయింది అన్నయ్యా!” ఏడుస్తూ చెప్పింది.
“అయ్యో.. భగవంతుడా!” అంటూ మరోమాట మాట్లాడలేకపోయాడు సత్యం.
“మరి.. అంత్యక్రియలు..” అని శివం అడగబోయాడు.
“ఇంకా కాలేదన్నయ్యా.. మార్చురీలో ఉంచారు”
“వాడి అన్నయ్య కొడుకు ఢిల్లీలోనే ఉన్నాడుగా.. కబురు పెట్టావా..?”
“కబురు పెట్టాను. కానీ, రాలేనన్నాడు. కరోనా అంటువ్యాధి కదా?”
“అయితే మాత్రం.. మాస్క్ పెట్టుకొని దూరంగా కూర్చోవచ్చుగా.. కొడుకుతో సమానం”
“వాళ్ల పెద్దవాళ్లు వద్దన్నారట. మనం ఏం చేయగలం” చెప్పిందామె.
“మరేం ఫర్వాలేదమ్మా.. నేనూ సత్యం రేప్పొద్దునే వచ్చేస్తాం. అంతవరకూ మార్చురీలోనే ఉంచమని డాక్టర్లకు చెప్పు. వాడి అంత్యక్రియలు మేం చేస్తాం!” అంటూ కాల్ కట్ చేసి, వెంటనే కంప్యూటర్లో మర్నాడు ఉదయం ఢిల్లీ ప్రయాణానికి ఫ్లయిట్ టిక్కెట్లు బుక్ చేశాడు శివం. ఆ మధ్యాహ్నం మూడు గంటలకు ఇద్దరూ ఢిల్లీ చేరుకున్నారు. వెంటనే సుందరం భార్యకు ఫోన్ చేసి, ఆసుపత్రికి చేరుకున్నారు. బరువెక్కిన హృదయాలతో, పెల్లుబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ.. మార్చురీలో ఉన్న సుందరం భౌతిక కాయాన్ని అంబులెన్స్లో పెట్టించి శ్మశానవాటికకు తీసుకెళ్లారు. చితి పేర్పించారు.
“ఒరే సుందరం! నిన్ను పోగొట్టుకోవడం మా దురదృష్టం రా! నేను ఢిల్లీ వచ్చికూడా నిన్ను చూడలేకపోయాను. నన్ను క్షమించు!” అంటూ చితిమీద పడుకోబెట్టిన సుందరం పార్థివదేహానికి నమస్కరించి నిప్పు అంటించాడు సత్యం.
‘నేనూ తప్పు చేశాన్రా.. సత్యం ఢిల్లీ వెళ్తున్నాడని తెలియగానే, నిన్ను కలవడానికి వీల్లేదని ఆంక్ష విధించాను. నన్ను కూడా క్షమించు!’ సత్యం వెనకాలే చితిచుట్టూ ప్రదక్షిణ చేస్తూ అనుకున్నాడు శివం.
చితి మంటలు ఉవ్వెత్తున పైకి లేచాయి.
“ఈశ్వరా! మా ప్రాణ స్నేహితుని ఆత్మకు శాంతిని చేకూర్చు. అప్పుడే మాకు ఆత్మ సంతృప్తి లభిస్తుంది” అంటూ కనిపించని ఆ పరమేశ్వరునికీ, ఎదురుగా కనిపిస్తున్న అగ్ని దేవుడికీ నమస్కరించారు. కన్నీళ్లు నిండిపోయిన వారిద్దరి కండ్లకూ ఆ చితిమంటలు మసకమసకగా కనిపించాయి.
మర్నాడు పొద్దున్నే కుటుంబంతో కలిసి ఎయిర్పోర్టుకి వెళ్లాడు సత్యం. మధ్యాహ్నం రెండయ్యేసరికి ఢిల్లీకి చేరుకొన్నారు. ఆ రోజంతా రెస్టు తీసుకొని తర్వాత రెండు రోజుల్లో అక్కడ చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసేశారు. సోమవారం ఆఫీసు పని పూర్తి చేసుకొని హోటల్ రూమ్కి వచ్చాడు సత్యం.
“పని అయిపోయిందిగా.. సుందరం అంకుల్ ఇంటికి వెళ్దాం డాడీ!” అడిగాడు బాబి.
“ కష్టం రా! వాడిల్లు చాలాదూరం”
‘ టాక్సీలో వెళ్లొచ్చు కదా..”
“ఇప్పుడు ఓపిక లేదు నాన్నా” చెప్పాడు సత్యం.
“మరేం ఫర్వాలేదమ్మా.. నేనూ సత్యం రేప్పొద్దునే వచ్చేస్తాం. అంత వరకూ మార్చురీలోనే ఉంచమని డాక్టర్లకు చెప్పు. వాడి అంత్యక్రియలు మేం చేస్తాం!” అంటూ కాల్ కట్ చేసి, వెంటనే కంప్యూటర్లో మర్నాడు ఉదయం ఢిల్లీ ప్రయాణానికి ఫ్లయిట్ టిక్కెట్లు బుక్ చేశాడు శివం. ఆ మధ్యాహ్నం మూడు గంటలకు ఇద్దరూ ఢిల్లీ చేరుకున్నారు. వెంటనే సుందరం భార్యకు ఫోన్ చేసి, ఆసుపత్రికి చేరుకున్నారు. బరువెక్కిన హృదయాలతో, పెల్లుబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ.. మార్చురీలో ఉన్న సుందరం భౌతిక కాయాన్ని అంబులెన్స్లో పెట్టించి
శ్మశానవాటికకు తీసుకెళ్లారు. చితి పేర్పించారు.
జీడిగుంట రామచంద్రమూర్తి
నాటక రచయితగా, ఆకాశవాణి ప్రయోక్తగా చిరపరిచితులైన జీడిగుంట రామచంద్రమూర్తి, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు. విద్యాభ్యాసం తర్వాత వరంగల్ సహకార బ్యాంకులో, విద్యాశాఖలో కొన్నాళ్లపాటు పనిచేశారు. 1971లో ఆకాశవాణిలో ప్రయోక్తగా చేరి, పూర్తిస్థాయి రేడియో కళాకారుడిగా మారారు. ఆయన రాసిన తొలి కథ ‘హంస గమన’. ఆ తర్వాత 400 కథలు, 40 నాటకాలు, 8 నవలలు రాశారు. కొన్ని సినిమాలకు మాటలు అందించారు. ప్రసారమాధ్యమ రచనలో జీడిగుంటది అందె
వేసిన చేయి. రేడియో, టెలివిజన్, సినిమాలద్వారా ఆయన రచనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. రెండుసార్లు నంది బహుమతి అందుకున్నారు. కళారత్న పురస్కారంతోపాటు అనేక అవార్డులూ దక్కించుకున్నారు. అనారోగ్యంతో నవంబర్ 2020లో కన్నుమూశారు.
ఆయనకు నివాళిగా ఈ కథ..
నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం నిర్వహించిన ‘కథల పోటీ-2020’లో దివంగత జీడిగుంట రామచంద్రమూర్తి సంస్మరణార్థం ప్రత్యేక బహుమతికి ఎంపికైన కథ.
జీడిగుంట రామచంద్రమూర్తి