ముంబై, ఫిబ్రవరి 7: దేశీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు వీడటం లేదు. సోమవారం సూచీలు మరోసారి భారీగా క్షీణించాయి. ద్రవ్యోల్బణం సెగల మధ్య సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్ల పెంపు దిశగా అడుగులు వేస్తుండటంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడిలోకి జారుకున్నారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,023.63 పాయింట్లు లేదా 1.75 శాతం పతనమై 58వేల స్థాయికి దిగువన 57,621.19 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 302.70 పాయింట్లు లేదా 1.73 శాతం పడిపోయి 17,213.60 వద్ద నిలిచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ విలువ అత్యధికంగా 3.65 శాతం దిగజారింది. ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో షేర్లూ నష్టపోయాయి. రంగాలవారీగా బీఎస్ఈ ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్, టెలికం షేర్లు 2.30 శాతం మేర పడిపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా 1.25 శాతం క్షీణించాయి. ఇక అంతర్జాతీయంగా జపాన్, దక్షిణ కొరియా సూచీలు నష్టాల్లో.. హాంకాంగ్, చైనా సూచీలు లాభాల్లో ముగిశాయి. ప్రధాన ఐరోపా మార్కెట్లూ లాభాల్లోనే కదలాడుతున్నాయి.
నష్టాలకు కారణాలు
ద్రవ్యోల్బణం అదుపునకు వడ్డీరేట్లను పెంచాలని ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు భావిస్తున్నాయి. ఫెడ్ రిజర్వ్ ఊహించినదాని కంటే వేగంగా వడ్డీరేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చిలో 50 బేసిస్ పాయింట్లు పెరగవచ్చంటున్నారు. ఇదే జరిగితే బాండ్ల పెట్టుబడులు ఆకర్షణీయమై, స్టాక్స్ పెట్టుబడులకు ఆదరణ కరువవనున్నది.
ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఉపసంహరించుకుంటున్నారు. ఇది అమ్మకాల ఒత్తిడికి దారితీస్తున్నది. గడిచిన మూడు రోజుల్లో బీఎస్ఈ మార్కెట్ విలువ రూ.6 లక్షల కోట్లు తరిగిపోయింది.
ఆయా రాష్ర్టాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం కూడా దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ను ప్రభావితం చేస్తున్నదని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
రూ.6 లక్షల కోట్లు ఆవిరి
వరుస నష్టాల నడుమ మూడు రోజుల్లో దాదాపు రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు రూ.5.82 లక్షల కోట్లు చేజార్చుకున్నారు. బుధవారం రూ.270 లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ విలువ.. గురు, శుక్ర, సోమవారాల్లో నష్టాల కారణంగా రూ.264.82 లక్షల కోట్లకు దిగజారింది. గత వారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లు 25 బేసిస్ పాయింట్లు పెరగడం, మార్చిలో అమెరికా రిజర్వ్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్లు పెంచే వీలుండటం, గురువారం ఆర్బీఐ ద్రవ్యసమీక్ష ఫలితం వెలువడనుండటం మార్కెట్లను అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి.