నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2020’లో ప్రచురణకు ఎంపికైన కథ.
“నాన్నా! నాన్నా!” అన్న గొంతుతో.. నా రోజు ప్రారంభమైంది.
ఎందుకో ఈ రోజు ఆ గొంతులో ఏదో తెలియని ఆనందం. ఎప్పుడూ లేనిది, నా దగ్గరికి వచ్చి..
“నాన్నా! ఈరోజు మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్తున్నాం. తొందరగా తయారుకండి” అంటూ నా బ్యాగ్ సర్దాడు.
నేను స్నానం చేసి వచ్చేసరికి, ఎప్పుడూ కస్సుబుస్సుమనే కోడలు.. నాకిష్టమైనవన్నీ చేసి పెట్టింది. ప్రేమగా వడ్డించింది.
మూలకున్న కళ్లద్దాలను చెవులకు జోడించి, క్యాలెండర్ను మార్చి మార్చి చూశాను. ఈరోజు ఎలాంటి పండుగలూ లేవు. అలాగని, ఇది కల కూడా కాదు. చూస్తుంటే.. ఏదో మహత్తర కార్యక్రమానికి శంకుస్థాపన చేసేలా ఉన్నారు.
నాలో నేను నవ్వుకొని, కోడలు పెట్టిన నాలుగు ఇడ్లీలను కడుపులో వేసుకొని, కొడుకు తెచ్చిన పేపర్ చదువుతూ కుర్చీలో వాలాను.
ఇంతలో, వాడొచ్చి.. “కారులో కూర్చోండి నాన్నా” అంటూ ఆదేశించాడు.
నేను వెళ్లిన కొద్దిసేపటికి, కోడలుపిల్లతో ఏదో మాట్లాడుకొని వచ్చాడు.
కారు.. గమనం తెలియని చోటుకు పయనమైంది. అసలు విషయం ఏమిటంటే, గమనం తెలియంది నాకొక్కడికే.
చూస్తుండగానే కారు పక్క ఊర్లోని వృద్ధాశ్రమం ముందర ఆగింది. ఇదేంటని అడిగేలోగానే..
“నాన్నా! ఇక ముందు మీరు ఉండేది ఇక్కడే. మేము ఆఫీసుకు వెళ్లాక, మాకు మీ మీద దిగులు ఎక్కువ అవుతున్నది. మీకు కూడా ఒంటరిగా ఉండటం ఇష్టం ఉండదు కదా! పైగా, ఈ వయసులో మీకది కష్టం కూడా. అందుకే, ఇక్కడ ఉండండి. మన అపార్ట్మెంట్ దగ్గరుండే రామారావు అంకుల్, రాయుడు అంకుల్ కూడా ఇక్కడే ఉన్నారు. మీకిక్కడ బాగుంటుంది. వారితో కాలక్షేపం కూడా అవుతుంది” అంటూ వాడే సమాధానమిచ్చి, తిరుగు ప్రయాణమయ్యాడు.
నా అడుగులు తడబడుతూ ఆశ్రమం వైపు
కదిలాయి. గేటు వద్ద రామారావు నా కండ్లముందు వాలాడు. నా భుజం మీద చేయి వేసి, ఆశ్రమం లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న ఆశ్రమవాసులందరినీ పరిచయం చేశాడు.
పరిచయాలు కాస్తా కబుర్లయ్యాయి. కబుర్లతో రాత్రయ్యింది. ఏదో తిని, మంచం మీద వాలాను. నా శరీరం నిద్రకు సరేనన్నా.. మనస్సు మాత్రం ససేమిరా అంటున్నది. దాంతో.. అలా పరధ్యానంగా కూర్చున్న నాకు ఎప్పుడు నిద్ర పట్టిందో ఆ దేవుడికే తెలియాలి.
ఎప్పటిలానే పొద్దున్నే లేచి, వాకింగ్కు బయల్దేరా. గేటు దగ్గర రాయుడు.. తన బ్యాగ్తో కూర్చున్నాడు. తన కొడుకు తనను తీసుకెళ్లడానికి వస్తున్నాడని కన్నీరు కార్చాడు. రాయుడుతో నా మాటలు ముగించుకొని వెళ్తుండగా, రామారావు నా వెంట వస్తాననడంతో, ఇద్దరం నడకందుకున్నాం. ఎప్పటిలానే మా నడక అంతులేని
కబుర్లతో సాగింది.
“అరేయ్! నా పిల్లలను చదివించి పెద్ద తప్పు చేసిన. పెద్దోడు అమెరికా, చిన్నోడు ఆస్ట్రేలియా,
పెద్దది లండన్, చిన్నది శ్రీలంక. ఇలా నలుగురు నాలుగు దిక్కులకెళ్లి, మమ్మల్ని దిక్కలేనోల్లను జేసిన్రు. ఆ బెంగతోనే.. పొయి
నేడాది అది సచ్చిపోయింది.
కొరివి పెట్టడానికి రానోళ్లు, దాని దినాలకచ్చిన్రు. నన్నిక్కడికి తోలిన్రు. శిన్నప్పటి సందీ పుత్తడోలే సూసుకున్న మేము.. ఇప్పుడిత్తడోల్లమైనం” అంటూ బోరున ఏడ్చాడు.
అవును.. ఎలాంటి చదువూ, సంధ్యా లేని మేము.. మా అమ్మా-బాపులను బతికున్నన్ని రోజులూ మంచిగ చూసుకున్నాం. వీళ్లలాగా గాలికి వదిలేయలే! వీళ్లకు గడియారం చుట్టూ పరిగెత్తడమే తప్ప.. పరుగు నేర్పించిన తల్లిదండ్రులను పట్టించుకునే సమయం ఎక్కడుంది.
కబుర్లతో సాగుతున్న ఈ ఓదార్పు యాత్రలో, కన్నీరు తప్ప సాక్షు లెవ్వరు లేరు.
చకచకా పరిగెడుతున్న మబ్బులు, తెల్లని ఆకాశాన్ని నల్లగా మార్చాయి. మాకు తోడుగా, ఆకాశం కూడా కన్నీరు కార్చింది. బోరున వర్షం కురవడంతో మా ఆశ్రమం వెనకాలే ఉన్న
అనాథాశ్రమం ముందు తడుస్తూ నిల్చున్నాం. ఇంతలో చిన్నిచిన్ని చేతులు మమ్మల్ని తాకాయి.
“తాతయ్యలూ ఆశ్రమం లోపలికి రండి! తడుస్తూ నిల్చుంటే జలుబు చేస్తుంది!” అంటూ మమ్మల్ని ఆశ్రమం వైపు నడిపించారు ఆ పిల్లలు.
ఆ నవ్వులతో మా మనసులు తేలికయ్యాయి.
వారి ఆశ్రమమంతా పాతదైంది. కొన్నిచోట్ల నీళ్లు కారుతున్నది. వర్షంతో గోడలు నాని
పోయాయి. ఇంత చిన్న ఆశ్రమంలో వారికే చోటు లేకున్నా మమ్మల్ని రమ్మన్న, ఆ లేత మనసుల్ని చూస్తే.. నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు.
అక్కడున్న మేనేజర్ను.. “ఏంటయ్యా! పిల్లలుండే చోటు, ఇలా ఉంటే ఎలా? అసలే రోజులు బాలేవు. పిల్లలకు జ్వరాలస్తే ఎట్టా? కొంచెం మరమ్మతులు చేయించరాదు!” అంటూ గట్టిగానే ప్రశ్నించాడు రామరావు.
దానికి బదులుగా.. “సార్! వాళ్లకు తిండి పెట్టడానికే వాళ్ల కాళ్లూ, వీళ్ల కాళ్లూ పట్టుకొంటున్నా. అయినా మరమ్మతులు చేయించాలంటే నా ఒక్కడి వల్ల కాదు సార్. నాకు చేతనైనంత
వరకూ ప్రయత్నిస్తున్నా. కావడం లేదు. నాకు మాత్రం వీళ్లను ఇలా ఉంచాలని సరదానా సార్!” అని వినయంగా చెప్పాడు.
వీళ్ల మాటలతో కాబోలు మబ్బులు పక్కకు జరిగాయి. పిల్లలకు ‘టాటా’ చెప్పి, మా ఆశ్రమం వైపు అడుగులేశాం.
గేటు దగ్గర రాయుడిని చూసి.. “కొడుకింకా రాలేదా! ఎంతసేపు ఇక్కడ కూర్చుంటావ్. ఫోన్ చేసి ఎప్పుడొస్తాడనేది కనుక్కో!” అంటున్న నా మాటలు పూర్తయ్యేలోపే.. రావుగారు అందుకొని.. “పొద్దుగాల్నే బ్యాగు వట్టుకొని కొత్త పెండ్లి కొడుకోలే ఇక్కడ కూసునుడు. పొద్దుమోపు కొడుకు రాలేదని ఏడ్సుకుంట మంచంల పండుకునుడు. దొరగారికి ఈ పైత్యం ఎప్పుడు ఇడుత్తదో ఏమో!” అంటూ వాడిమీద ఎగిరెగిరి పడ్డాడు.
“అసలు ఏమైంది” అని రావుగారిని మర్యాదగా అడిగా.
“ఈణ్ని ఈని కొడుకు ఆరునెల్ల ముందు ఈ కొంపల ఇడ్షిపెట్టి వోయిండు. అప్పటిసంది గిదే తంతు. కొడుకత్తలేడన్న రందితోని ఏనుగోలె ఉండేటోడు.. ఎలుకోలె పీక్కపోయిండు. సూసినవా లింగా!” అంటూ కన్నీరు కార్చాడు.
ఈ ఆశ్రమంలో ఉన్న అందరి కథా దాదాపు ఇలాంటిదే!
నా పెంకుటిల్లును అమ్మి, వాడు ఇల్లు కొనుక్కున్నాడు. అలా నా సొంతిల్లు నాకు దూరమైంది. వాడి ఇంట్లోకి నా పాత వస్తువులు తీసుకు
రావద్దన్నాడు. అలా నా జ్ఞాపకాలూ దూరమయ్యాయి. నా కూతురుకు ఇంటి పని రావట్లేదని, నా భార్యను తీసుకెళ్లింది. అలా.. నలభై ఏళ్లుగా కలిసున్న మా బంధం విడిపోయింది. మనువళ్లు నాతో ఆడుకొని పాడవుతున్నారంటూ.. టూషన్లలో చేర్పించారు. అలా నాకు కాలక్షేపం దూరమైంది. రోజంతా నేను, నా పేపరు. జ్ఞాపకాలతో నా కండ్లు కన్నీరు కార్చాయి. ఇందరి జీవిత చిత్రాలను చూసి, నా కండ్లకు అంటుకున్న పొర తొలగిపోయింది. నా జీవిత గమనం, గమ్యం మారిపోయాయి.
ఎప్పటిలానే, సాయంత్రం మేమంతా కూర్చొని మాట్లాడుకుంటున్నాం.
“ఆ అవ్వ-అయ్య లేని పిల్లగాండ్లకు మనమేమన్న శెయ్యాలెరా!” అన్నారు రావుగారు.
“మనల్ని చూడటానికి, చేయడానికే ఎవరస్తలేరు. మనం వాళ్లకు ఏం చేయగలుగుతాం రా?” అని నిస్సహాయంగా అన్నాడు రాయుడు.
“మనం కష్టపడ్డ సొమ్మంతా, మనల్ని కాదన్నోల్లకు ఇచ్చేబదులు, ఈ పసిపిల్లలకు ఇస్తే తప్పేముంది. మనల్ని కాదనుకున్న వాళ్లకోసం కన్నీరు కార్చే బదులు, ఈ పిల్లలకు కష్టం రాకుండా చూసుకోవడం మేలు కదా! వాళ్లకు మన మీద ధ్యాసే లేనప్పుడు, వాళ్ల మీద మనకు దిగులెందుకు. ఎవరి కాళ్ల మీద వారే నిల్చోవాలి.. అదే జీవితం. అసలు ఈ ఆస్తి పంపకం అనే ఆనవాయితీ పోయిన నాడే, ఈ ఆశ్రమాలు పోతాయి” అంటూ నాలో ఉన్న ఆవేదనంతా బయటికి కక్కాను.
ఇంత ఆవేశంతో నన్నెప్పుడూ చూడని నా స్నేహితులు, ఒక్కసారిగా బిత్తరపోయారు. అవును.. నేనెప్పుడూ ఇంత ఆవేశంతో మాట్లాడి ఉండను. నా ఇంటిని అమ్మినప్పుడు మాట్లాడలేదు. నా భార్యను తీసుకెళ్లినప్పుడు మాట్లాడలేదు. పిల్లలను ట్యూషన్లో చేర్పించినప్పుడు మాట్లాడలేదు. నన్నిక్కడ ఒదిలెల్లినప్పుడూ మాట్లాడలేదు. ఇక ఇప్పుడు కూడా మాట్లాడకుంటే నేనుండి వ్యర్థం. నా మనసులో ఉన్న కాంక్ష తీరాలంటే మొదటి అడుగు నాదే కావాలనుకున్నాను. ఆ మర్నాడే నా ప్రయాణం
మొదలెట్టాను.
ఎన్నో ఏండ్లయ్యింది తనను చూసి! అప్పుడెప్పుడో తన కూతురితో వెళ్లినప్పుడు చూశా. అప్పుడు తను నా మీద చాలా కోపంగా ఉంది. బహుశా వాళ్లు తీసుకెళ్తున్నప్పుడు నేనేం అనలేదని కాబోలు. తన కోపం గుర్తొచ్చిన వెంటనే ఆ భగవంతుణ్ని గట్టిగా ప్రార్థించా.
తానున్నన్ని రోజులూ మా ఇల్లు కళకళలాడుతూ ఉండేది. నా కోసం, తన గారాల గాడిదల కోసం తనకెప్పుడూ దేవుడి ద్యాసే. తన అగరొత్తుల సువాసనతో నా రోజు ప్రారంభమయ్యేది. మా ఇంట్లో అలారం ఉండి దండగ. తను రోజూ మోగించే గంట శబ్దంతో, నాకు మెలకువ వచ్చేది. నేను లేచే వరకూ ఆ గంట అలా మోగుతూనే ఉండేది.
చూస్తుండగానే నా గమ్యం చేరువైంది. బస్సు దిగి, ఆటో ఎక్కి తన ఇంటి ముందట దిగాను. ఇంటి ముందట నా యశోద వేసిన ముగ్గు దర్శనమిచ్చింది. గేటు తీసుకొని లోపలికి వెళ్తుంటే.. ఎవడో బుడ్డోడు గుమ్మం ముందు నిల్చొని..
“అమ్మా! ఎవరో బూచోడొచ్చాడు!” అంటూ కేకేశాడు.వాడి అరుపులకు లోపలున్న వాళ్లంతా బయటికి వచ్చారు.
నా బిడ్డ నన్ను చూడగానే.. “ఏంటి నాన్నా.. ఈ బట్టలు, ఈ వేశం! పిల్లోడు భయపడ్డాడు. అయినా, అన్నయ్య నిన్ను ఆశ్రమంలో చేర్పించాడటగా.. ఇక్కడికి ఎందుకొచ్చావ్?” అంటూ అరిచింది.
ఆ మాటలు విని నన్ను నేను సముదాయించుకొన్నా.
“ఇంటికొచ్చిన తండ్రిని లోపలికి రమ్మనకుండా, అందరి ముందూ ఎందుకొచ్చావని అడుగుతావా? పొట్టకోస్తే అక్షరం ముక్క రాని నీకు, పెద్దింటి సంబంధం చేసి తప్పు చేశా. కాలికి ముల్లంటకుండా పెంచినోళ్లనే తందామని చూస్తే ఊరుకునేది లేదు! అయినా ఈ వాదనంతా నాకు అనవసరం. నేనొచ్చింది నా యశోదను తీసుకెళ్లడానికి..” అంటూ గట్టిగానే నిలదీశా.
నా మాటలు విని అప్పుడే గుమ్మం నుండి బయటికొచ్చింది యశోద. తనను చూసిన వెంటనే కన్నీరు ఆగలేదు.
పెద్ద బొట్టు, ఎప్పుడూ ముఖంపై వేలాడే నవ్వు, చేతినిండా గాజులు, కాళ్లకు గలగలమనే గజ్జెలు, చిన్న అమ్మోరులా కనిపించే యశోద.. బక్కగా అయ్యింది. పని నేర్పించడానికి వచ్చి, పని మనిషిలా తయారైంది.
ఏదయితేనేం.. వాళ్లందరినీ ఎదురించి తనతో నా ప్రయాణాన్ని కొనసాగించా.
ఇద్దరం బస్సెక్కి, సీట్లో కూర్చున్నామో లేదో.. వాడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ స్విచ్-ఆఫ్ చేశా. జరిగిన.. జరగాల్సిన విషయాలన్నిటినీ యశోదకు వివరించా.
మొదట్లో తను కాస్త కంగారు పడ్డా..
నాలో వచ్చిన మార్పును చూసి వాటన్నిటికీ సరేనంది.
మాటల్లోనే ఊరు వచ్చింది. బస్సు దిగి పక్కనే ఉన్న హోటల్కు వెళ్లి భోజనం చేసి, ఆశ్రమానికి వెళ్లాం. అక్కడ నన్ను చూసిన మేనేజర్..
“ఏంటయ్యా? ఎవ్వరికీ చెప్పకుండా ఎటు పోయినవ్? నీకెమైన ఐతే ఎట్టా?” అంటూ నన్ను ఎడాపెడా కడిగేశాడు.
“బాబూ! ఈమె నా భార్య యశోద. తనను తీసుకురావడానికే పోయినా. చెప్పకుండా పోయినందుకు సారీ బాబూ” అంటూ సముదాయించా.
“దీనికి సారీ ఎందుకులేగానీ, ఇంకెప్పుడైనా ఎటన్న పోతే.. చెప్పిపో.. సరేనా!” అంటూ ఎటో కదలబోయాడు.
‘ఎలా చెప్పాలా?’ అని నేనుకునేలోపే..
“బాబూ! ఈ వృద్ధాశ్రమాన్నీ, వెనకున్న
అనాథాశ్రమాన్నీ కలిపేద్దాం. ఈ వయసులో మా ముసలోళ్లకు, ఆ పసి పిల్లల నవ్వులు చూస్తేనన్నా.. మమ్మల్ని వదిలెళ్లిన మా పిల్లలు గుర్తుకురారు. ఆ పిల్లలు మాతో కలిసి ఆడుకొంటే.. వాళ్లు అనాథలని అనుకోరు. ఈ చివరి క్షణాల్లోనైనా ఈ ముదిరిన మనుషుల్ని అర్థం చేసుకోండి సార్..” అంటూ కన్నీరు కార్చింది యశోద.
ఆ మాటలకు మేనేజర్ కదిలిపోయాడు. ‘సరే’ అనక తప్పలేదు.
బ్యాంకులో ఉన్న డబ్బు, పొలాలు అమ్మగా వచ్చిన డబ్బూ కలిపి.. వృద్ధాశ్రమాన్నీ, అనాథాశ్రమాన్నీ ఒక్కటిగా మార్చాం. కావాల్సిన మరమ్మతులు చేయించాం. పిల్లలు, పెద్దలు ఆడుకోడానికి పార్కును, చదువుకోడానికి లైబ్రరీని ఏర్పాటు చేశాం. వైద్య పరీక్షల కోసం ఓ డాక్టర్తో ఒప్పందం కుదుర్చుకున్నాం.
నా యశోదకు ఇష్టమైన గణపతి గుడిని కట్టించాం. నా కొడుకు వాడింటికి తేవద్దన్న నా పాత వస్తువులు ఇక్కడ పనికొచ్చాయి.
చూస్తుండగానే.. ఇరవై ఏండ్లు గడిచి పోయాయి.
ఓ రోజు ఎవరో మునలాయిన నా ముందుకొచ్చి నిల్చున్నాడు. పక్కనున్న కండ్లద్దాలను ముక్కు మీద నిల్చోపెట్టి సరిగ్గా చూశా. నా పుత్రరత్నమే! బ్యాగుతో దర్శనమిచ్చాడు. వాడేదో చెబుతున్నా.. నా చెవులకది వినపడటం లేదు. బహుశా! వాడి కొడుకు వీడ్ని ఇక్కడ వదిలెళ్లినట్టు ఉన్నాడు. పశ్చాత్తాపంతో నిల్చున్న కొడుకుతో..
“జరిగిందంతా మర్చిపో.. ఇకనైనా హాయిగా ఉండటానికి ప్రయత్నించు. బంధాలను గౌరవించు”
అంటూ నేను తెచ్చుకున్న పేపర్ చదువుతూ కుర్చీలో వాలిపోయాను.
ఇదంతా చూసి ఫొటోలో ఉన్న యశోద నవ్వుకున్నది.
( కర్త + కర్మ + క్రియ = జీవితం )
“సార్! వాళ్లకు తిండి పెట్టడానికే వాళ్ల కాళ్లూ, వీళ్ల కాళ్లూ పట్టుకొంటున్నా. అయినా మరమ్మతులు చేయించాలంటే నా ఒక్కడి వల్ల కాదు సార్. నాకు చేతనైనంతవరకూ ప్రయత్నిస్తున్నా. కావడం లేదు. నాకు మాత్రం వీళ్లను ఇలా ఉంచాలని సరదానా సార్!” అని వినయంగా చెప్పాడు. వీళ్ల మాటలతో కాబోలు మబ్బులు పక్కకు జరిగాయి. పిల్లలకు ‘టాటా’ చెప్పి, మా ఆశ్రమం వైపు అడుగులేశాం.
“మనం కష్టపడ్డ సొమ్మంతా, మనల్ని కాదన్నోల్లకు ఇచ్చేబదులు, ఈ పసిపిల్లలకు ఇస్తే తప్పేముంది. మనల్ని కాదనుకున్న వాళ్లకోసం కన్నీరు కార్చే బదులు, ఈ పిల్లలకు కష్టం రాకుండా చూసుకోవడం మేలు కదా! వాళ్లకు మన మీద ధ్యాసే లేనప్పుడు, వాళ్ల మీద మనకు దిగులెందుకు. ఎవరి కాళ్ల మీద వారే నిల్చోవాలి.. అదే జీవితం. అసలు ఈ ఆస్తి పంపకం అనే ఆనవాయితీ పోయిన నాడే,
ఈ ఆశ్రమాలు పోతాయి” అంటూ నాలో ఉన్న ఆవేదనంతా బయటికి కక్కాను.
మండ శ్రీకర్
మండ శ్రీకర్ స్వస్థలం ప్రస్తుత వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి. తల్లిదండ్రులు మండ మంజుల- సాంబయ్య. 1999 ఆగస్టు 21న జన్మించిన శ్రీకర్, ప్రస్తుతం బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) చదువుతున్నాడు. ఈ కథే (మరో ప్రపంచం పిలిచింది) తన తొలి రచన. కరీంనగర్లోని ధన్గర్వాడీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. పాఠశాల స్థాయిలోనే అనేక వ్యాసాలు రాసి, బహుమతులు గెలుపొందాడు. 2016లో ఈనాడు దినపత్రిక నిర్వహించిన డా.అంబేద్కర్ వ్యాసరచన పోటీలో జిల్లా (ఉమ్మడి కరీంనగర్) స్థాయిలో ప్రథమ బహుమతి దక్కించుకొన్నాడు. పాఠశాలలో తనను ప్రోత్సహించిన తెలుగు పండితులు శేషం నరసింహచారితోపాటు అమ్మమ్మ- తాతయ్య జనగాని వరలక్ష్మి – పుల్లయ్య గార్లకు తన తొలి కథ (మరో ప్రపంచం
పిలిచింది)ను అంకితమిస్తున్నాడు శ్రీకర్.