సిల్హెట్: మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత జట్టు ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. శ్రీలంక, మలేషియాపై ఇప్పటికే విజయాలు సాధించిన టీమ్ఇండియా మూడో పోరులో యూఏఈని చిత్తుచేసింది. మంగళవారం జరిగిన పోరులో మన అమ్మాయిలు 104 పరుగుల తేడాతో గెలుపొందారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 75 నాటౌట్; 11 ఫోర్లు), దీప్తి శర్మ (49 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో యూఏఈ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులకు పరిమితమైంది. కవీషా (30) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టింది. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన భారత్ 6 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో నిలిచింది. భారత్ తమ తదుపరి పోరులో శుక్రవారం దాయాది పాకిస్థాన్తో తలపడనుంది.