నిజామాబాద్, అక్టోబర్ 23, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దుబాయిలోని ప్రసిద్ధ బుర్జ్ ఖలీఫా భవనంపై బతుకమ్మ పండుగ దృశ్య నివేదనం ఆద్యంతం ఆకట్టుకున్నది. శిఖరాగ్రం వరకు విద్యుత్ దీపాల కాంతుల్లో బతుకమ్మ వీడియో ప్రదర్శన అందరినీ కట్టిపడేసింది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తలపెట్టిన పూల పండుగ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, ఆశన్నగారి జీవన్ రెడ్డి, షకీల్ అహ్మద్, జాజాల సురేందర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బుర్జ్ ఖలీఫా వద్ద సందడి చేశారు. శనివారం రాత్రి భారత కాలమానం ప్రకారం 9.40 గంటలకు, మళ్లీ 10.40 గంటల సమయంలో బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ దృశ్య కావ్యం ఆవిష్కృతమైంది.