మహబూబ్నగర్ టౌన్, జూలై 4 : చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమని, అందుకే పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మౌలాలీగుట్ట వద్ద రూ.5.26 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మలశుద్ధి ట్రీట్మెంట్ కేంద్ర పనులకు, రూ.25 లక్షలతో నిర్మించనున్న జంతు సంరక్షణ కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మర్లు, ఆదర్శనగర్లో మొక్కలు నాటిన ఆయన స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. చెట్లు ఉంటేనే ఆరోగ్యం మీ సొంతం అవుతుందని సూచించారు. ప్రతి ఇంటికీ పంపిణీ చేసిన 6 మొక్కలను నాటాలన్నారు. మర్లు పార్కును అన్నివిధాలా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
మహబూబ్నగర్ పట్టణాభివృద్ధే తన ముందున్న ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. ఐదేండ్లలోనే పట్టణంలో ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పారు. జిల్లా కేంద్రాన్ని సుందరపట్టణంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం మేరకు రాష్ట్రంలోని మున్సిపాలిటీలను ఆదర్శంగా మార్చుతామన్నారు. ఇండ్ల నుంచి వచ్చే మురుగు ఎక్కడ పడితే అక్కడ పారకుండా మలశుద్ధి కేంద్రానికి పంపించి శుద్ధి చేసి ఎరువుగా వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు. అదే విధంగా జంతు సంరక్షణ కేంద్రాన్ని ఒక క్లినికల్గా నిర్వహించాలని సూచించారు. జంతువుల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని, కుక్కలాంటి జంతువులకు ఆపరేషన్తోపాటు చిన్న జంతువులను సంరక్షించాలని ఆదేశించారు. దగ్గరలో ఉన్న శ్మశాన వాటికను పార్కులా తీర్చిదిద్దాలన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి ప్రహరీ నిర్మించాలని అధికారులకు సూచించారు. దేశంలోనే అతిపెద్దదైన 2097 ఎకరాలు కలిగిన ఎకో పార్క్ను జిల్లాలో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు.
జిల్లాకు ఐటీ, ఇండస్ట్రియల్ పార్కు వంటివి వస్తున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలో మొత్తం ఎల్ఈడీ లైట్లు బిగించామన్నారు. మినీట్యాంక్బండ్, శిల్పారామం పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. జిల్లా కేంద్రానికి 160 కి.మీ. దూరం నుంచి కృష్ణా నీటిని మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్నామని వివరించారు. అనంతరం కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఆక్సిజన్ కోసం మొక్కలు తప్పనిసరి అన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్లు రోజా, నరేందర్, రాము, అనంతరెడ్డి, కిశోర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, ఆర్డీవో పద్మశ్రీ, వ్యవసాయశాఖ అధికారిణి సుచరిత, నాయకులు వెంకటేశ్, వెంకట్రాములు, డీఈ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
హెల్త్ కార్డులు పంపిణీ
మహబూబ్నగర్, జూలై 4 : న్యాయవాదులకు హెల్త్ కార్డులను ఆదివారం జిల్లా క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు ప్రముఖపాత్ర పోషించారని కొనియాడారు. సమాజంలో న్యాయవాదుల పాత్ర ఎంతో ముఖ్యమని గుర్తు చేశారు. వారికి అండగా ఉంటానన్నారు. అనంతరం మంత్రిని న్యాయవాదులు సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా క్లబ్ అధ్యక్షులు ప్రతాప్కుమార్, హన్మంతు, విక్రమ్దేవ్, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో అండగా ఉంటా..
ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాయమ్మతోటకు చెందిన రాజేంద్రప్రసాద్ ఇటీవలే మృతి చెందగా.. అతడి సతీమణికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్షా 75 వేల చెక్కును మంత్రి అందజేశారు. అనారోగ్య సమస్య ఉంటే బయపడాల్సిన అవసరం లేదని, అన్ని విధాలా ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మాజీ కౌన్సిలర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.