రేపు ఉదయం 8 గంటల నుంచి మొదలు
విధుల్లో 10వేల మంది సిబ్బంది
నేడు పోలింగ్ సామగ్రి పంపిణీ, తరలింపు
‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో రిటర్నింగ్ ఆఫీసర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నల్లగొండ ప్రతినిధి, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ఈ నెల 14న ఆదివారం ఉదయం 8గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది. పోలింగ్కు 3600మంది అధికారులతోపాటు సిబ్బందిని సిద్ధంగా ఉన్నారు. 5,05,565 మంది ఓటర్లకు గానూ 731 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు ఏదో ఒక గుర్తింపుకార్డు తప్పనిసరి అని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు. పోలింగ్ ఏర్పాట్లపై ఆర్ఓ ప్రశాంత్ జీవన్ పాటిల్ ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
నమస్తే : పోలింగ్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి?
ఆర్ఓ : పోలింగ్ ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశాం. నేటి ఉదయం నుంచి అన్ని జిల్లాల్లోని డిస్ట్రిబ్యూటరీ కేంద్రాల ద్వారా పోలింగ్ సిబ్బందికి కేంద్రాలను కేటాయిస్తాం. అదేవిధంగా అవసరమైన పోలింగ్ సామగ్రిని కూడా అందజేస్తాం. ఈసారి బ్యాలెట్ బాక్స్లు పెద్దసైజ్లో ఉండడంతో వీటిని తరలించడం కొంత ఇబ్బందిగా మారింది. పోలింగ్ కేంద్రాలకు సాయంత్రానికి సిబ్బంది చేరుకుంటారు. రేపు ఉదయం 8గంటలకు పోలింగ్ మొదలవుతుంది. పోలింగ్ కేంద్రాలకు 100మీటర్ల లోపు ఎలాంటి ప్రచారాన్ని అనుమతించబోం.
నమస్తే : పోలింగ్ సిబ్బంది, బందోబస్తు వివరాలు?
ఆర్ఓ : నియోజకవర్గ వ్యాప్తంగా 12 జిల్లాల్లో అన్ని రకాల సిబ్బంది కలిపి మొత్తం 10వేల మంది వరకు రెం డ్రోజుల పాటు విధుల్లో ఉంటారు. వీరిలో 3600మంది పోలింగ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇతర అన్నిరకాల విధుల్లో కలిపి మిగతా వారు ఉంటారు. ఇందులో పోలింగ్ విధుల్లో పాల్గొనే వారికి రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చాం. ఓటింగ్ ప్రక్రియ నిర్వహణ, పోలింగ్ స్టేషన్లో నిర్వర్తించాల్సిన విధులు తదితరాలపై సంపూర్ణ అవగాహన కల్పించాం. ఇక పోలింగ్ నిర్వహణ సజావుగా సాగేందుకు 5వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తుకు ప్రణాళిక సిద్ధం చేశాం.
నమస్తే : సమస్యాత్మక కేంద్రాలు ఎన్ని? తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి?
ఆర్ఓ : గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో 227పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించాం. ఇక్కడ ప్రత్యేకంగా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసి ఆర్ఓ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తాం. వెబ్కాస్టింగ్ కోసం 460 మంది టెక్నికల్ సిబ్బందిని నియమించాం. వీరితో పాటు మరో 110 మంది వీడియోగ్రాపర్స్ను కూడా ఎంగేజ్ చేశాం.
నమస్తే : అభ్యర్థులు, ఓటర్ల సంఖ్య భారీగా ఉండడంతో జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా?
ఆర్ఓ : ఈసారి మొత్తం 71మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందుకు అనుగుణంగానే బ్యాలెట్ పేపర్ సైజ్ కూడా పెరిగింది. ప్రత్యేకంగా పల్లె వెలుగు బస్సుల్లోనూ డోర్స్ వెడల్పుగా ఉండేవాటిని ఎంపిక చేశాం. వీటిల్లోనే బ్యాలెట్ బాక్స్లను తరలించేందుకు చర్యలు తీసుకున్నాం.
నమస్తే : కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
ఆర్ఓ : కౌంటింగ్ ప్రక్రియపై చాలా కసరత్తు చేశాం. 17వ తేదీ ఉదయం 8గంటల నుంచి నల్లగొండ పట్టణంలోని ఆర్జాలబావి వేర్ హౌసింగ్ గోదాముల్లోలోనే చేపట్టేందుకు ఏర్పాట్లు చేశాం. ఒక్కో టేబుల్పై ఒక్కో రౌండ్లో వెయ్యి ఓట్ల చొప్పున మొత్తం 56 టేబుళ్లపై 56వేల ఓట్ల కౌంటింగ్ జరుగనుంది. పోల్ అయిన ఓట్లను బట్టి రౌండ్ల సంఖ్యపై స్పష్టత రానుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ ఫలితం 17వ తేదీ రాత్రి పదిగంటలకు రావచ్చని భావిస్తున్నాం. మర్నాడు అంటే 18వ తేదీ ఉదయం 6గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తికావచ్చు. నాలుగు షిఫ్టులుగా విభజించి సిబ్బందిని కూడా షిఫ్టు వైజ్గా నియామకం చేస్తున్నాం.