శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. పుల్వామా జిల్లాలోని త్రాల్ సమీపంలో ఉన్న ఓ పండ్ల తోటలో ఐదు కిలోల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పేలుడు పదార్థాల నిల్వపై వచ్చిన పక్కా సమాచారం మేరకు రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్ఆర్), జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త బృందాలు తనిఖీలు నిర్వహించి, ఐదు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు. ‘దక్షిణ కాశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని అస్థిర పరిచేందుకు ఉగ్రవాదులు చేస్తున్న కుట్రలను అడ్డుకోవడానికి భద్రతా దళాలు చేస్తున్న కృషి ఫలితం ఈ రికవరీ’ పోలీసులు పేర్కొన్నారు. దక్షిణా కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపోరా ప్రాంతంలో ఐఈడీ గుర్తించిన తర్వాత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.