ఖమ్మం కల్చరల్, అక్టోబర్ 3: తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు బతుకమ్మ ఆడి అనుభూతులు, అనుబంధాలను పదిలపరుచుకుని సోమవారం బతుకమ్మకు వీడ్కోలు పలికారు. భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడికి చేర్చారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఖమ్మం, సత్తుపల్లి, వైరా, మధిర,వైరా పట్టణాలతో పాటు గ్రామాలన్నీ పూల వనాలయ్యాయి.. మహిళలు గౌరమ్మకు పెరుగన్నం, సజ్జముద్దలు, ఎండు కొబ్బరి అన్నం, పులిహోర, చపాతి ముద్దలు, బియ్యం, నువ్వులు, పల్లీలు, మొక్కజొన్న పొడులను నైవేద్యంగా సమర్పించారు. ఆకేరు, మున్నేరు, గోదావరి, పాలేరు జలాశయాల నిమజ్జన ఘాట్ల వద్ద సందడి నెలకొన్నది..
ఖమ్మం నగరంలో..
నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సంబురాలకు నగరవాసులు భారీగా హాజరయ్యారు. మహిళలు భారీ బతుకమ్మ వద్ద బతుకమ్మ పాటలు పాడారు. కుంకుమ పూజలు చేశారు. కళాకారుల కోలాట ప్రదర్శన నగరవాసులను ఆకట్టుకున్నది. వేడుకలో కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డీఆర్డీవో విద్యాచందన, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ భవన్లో..
నగరంలోని టీఆర్ఎస్ భవన్లో ఘనంగా బతుకమ్మ సంబురాలు జరిగాయి. వేడుకలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మం నగరంలో బతుకమ్మ ఆడుతున్న ఆడపడుచులు